పసికందులకు అరుదైన కాలేయ శస్త్రచికిత్స
ABN , First Publish Date - 2020-08-10T17:36:06+05:30 IST
పసికందులకు అరుదైన కాలేయ శస్త్రచికిత్స
చెన్నై, (ఆంధ్రజ్యోతి): స్థానిక రేలా ఆస్పత్రిలో యేడాదిలోపు వయస్సు కలిగిన పచ్చకామెర్లు, పిత్తాశయ సమస్య తో బాధపడుతున్న ముగ్గురు పసిబిడ్డలకు అరుదైన కాలేయ శస్త్రచికిత్స నిర్వహించినట్లు ఆ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ మహమ్మద్ రేలా తెలివపారు. నెల్లూరు, బెంగళూరు, ఢిల్లీ నుంచి వచ్చిన ముగ్గురు దంపతులకు చెందిన ఆ పసిబిడ్డలు 3.5 నుండి 5.5 కేజీల బరువు కలిగి పచ్చకామెర్లతో బలహీనమైన స్థితిలో తమ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారని తెలిపారు. సాధారణంగా యేడాదిలోపు పసికందుల్లో పునర్నిర్మాణానికి అవసరమయ్యే రక్తనాళాలు కలిగి ఉండటం వల్ల కాలేయమార్పిడి శస్త్రచికిత్సచేయడం సవాలుతో కూడిన పని అని చెప్పారు. ఈ పరిస్థితుల్లో తమ ఆస్పత్రికి చెందిన కాలేయ వైద్యనిపుణుడు డాక్టర్ నరేశ్ షణ్ముగం నాయకత్వంలోని వైద్యబృందం ఆ ముగ్గురు పసిబిడ్డలకు పిత్తాశయ కణాలను పునరుజ్జీవింపజేసే రీతిలో శస్త్రచికిత్సలను నిర్వహించినట్లు వివరించారు. రేలా ఆసుపత్రి సీఈవో ఇలంకుమరన్ కలియమూర్తి మాట్లాడుతూ తమ ఆసుపత్రిలో పద్దెనిమిది నెలల వ్యవధిలో వందకు పైగా చిన్నారులకు కాలేయ శస్త్రచికిత్సలు చేశామని తెలిపారు.