భారత్‌లో 4 లక్షల మార్కుకు చేరుకున్న కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-06-21T22:33:41+05:30 IST

దేశంలో కరోనా కేసులు నాలుగు లక్షల మార్కు దాటేశాయి. నేడు దేశవ్యాప్తంగా 15,413 కేసులు

భారత్‌లో 4 లక్షల మార్కుకు చేరుకున్న కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు నాలుగు లక్షల మార్కు దాటేశాయి. నేడు దేశవ్యాప్తంగా 15,413 కేసులు నమోదయ్యాయి. ఒక రోజులో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,10,461కి చేరుకుంది. అదే సమయంలో దేశంలో 2,27,755 మంది కోలుకున్నారు. ఒక్క రోజులో ఏకంగా 13,925 మంది కోలుకుని డిశ్చార్జ్ కావడం ఇదే తొలిసారి. ఫలితంగా దేశంలో రికవరీ రేటు మెరుగై 55.48%కి చేరుకుంది. దేశంలో ఇంకా 1,69,451 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశంలో ఇప్పుడున్న యాక్టివ్ కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్య 58,305 ఎక్కువగా ఉండడం గమనార్హం. 


గత 24 గంటల్లో 306  మంది కరోనాతో కన్నుమూశారు. ఫలితంగా మొత్తం మృతుల సంఖ్య 13,254కు పెరిగింది. జూన్ నాటికి 20.68 లక్షల శాంపిళ్లును పరీక్షించగా, గత 24 గంటల్లో ఏకంగా 1.9 లక్షల నమూనాలను పరీక్షించారు.


100 కేసుల నుంచి లక్ష కేసులకు చేరుకోవడానికి భారత్‌లో 64 రోజులు పట్టగా, 15 రోజుల్లో కేసులు రెండు లక్షలకు చేరుకున్నాయి. ఆ తర్వాత 10 రోజుల్లోనే 3 లక్షల మార్కును దాటేశాయి. ఇప్పుడు 8 రోజులకే లక్ష మార్కును దాటేసి 4 లక్షల మార్కును చేరుకున్నాయి. కాగా, భారత్‌లో వరుసగా పదో రోజు కూడా 10 వేలకు పైగా కేసులు నమోదు కావడం గమనార్హం. 

Updated Date - 2020-06-21T22:33:41+05:30 IST