అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ వాయిదా
ABN , First Publish Date - 2020-06-18T22:56:10+05:30 IST
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి నిర్వహించ తలపెట్టిన భూమి పూజ వాయిదా పడింది. భారత్, చైనా సరిహద్దు వద్ద...
యూపీ: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి నిర్వహించ తలపెట్టిన భూమి పూజ వాయిదా పడింది. భారత్, చైనా సరిహద్దు వద్ద యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. షెడ్యూల్ ప్రకారం జూలై 1న రామ మందిర నిర్మాణానికి భూమి పూజ జరగాల్సి ఉంది. జూలై 1న ఆషాఢ శుద్ధ ఏకాదశి.. బుధవారం.. విశాఖ నక్షత్రంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేయాల్సి ఉంది.
రామాలయ శంకుస్థాపనతో పాటు భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేయనున్న కాటేజీలు, ఇతర వసతుల నిర్మాణ పనులను ప్రారంభించాలని భావించారు. ప్రధాని మోదీ వర్చువల్గా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారని అంతా అనుకున్నారు. ఇప్పుడు తాజాగా భూమిపూజ వాయిదా పడటంతో కొత్త తేదీ ఎప్పుడు ప్రకటిస్తారో తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే.. అయోధ్యలోని మంజా గ్రామంలో సరయూ నది ఒడ్డున 251 మీటర్ల ఎత్తైన రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని యోగీ సర్కారు సంకల్పించింది. ఇందుకు సంబంధించిన భూసేకరణ పూర్తి కావొచ్చిందని అధికారులు తెలిపారు. ప్రపంచంలోనే ఇది ఎత్తైన విగ్రహంగా గుర్తింపు పొందనుందని, పటేల్ ఐక్యతా విగ్రహం కంటే దీనిఎత్తు ఎక్కువని చెప్పారు.