తలైవర్ తేల్చేదెప్పుడు...?
ABN , First Publish Date - 2020-10-07T13:19:47+05:30 IST
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగేట్రం వచ్చే యేడాది ఫిబ్రవరికి వాయిదా పడింది. డిసెంబర్లో పార్టీని ప్రారంభిస్తారని ఎదురుచూసిన లక్షలాదిమంది రజనీ అభిమానులకు

చెన్నై : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగేట్రం వచ్చే యేడాది ఫిబ్రవరికి వాయిదా పడింది. డిసెంబర్లో పార్టీని ప్రారంభిస్తారని ఎదురుచూసిన లక్షలాదిమంది రజనీ అభిమానులకు తీవ్ర నిరాశే మిగిలింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా రజనీ అటు పెండింగ్లో ఉన్న ‘అన్నాత్తే’ సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు, ఇటు రాజకీయ పార్టీని ప్రారంభించేందుకు తటపటాయిస్తు న్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇక ఎనిమిది నెలలే మిగిలి ఉండటంతో అన్నాడీఎంకే, డీఎంకే తదితర ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించాయి. అన్నాడీఎంకే బుధవారం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న సీఎం అభ్యర్థి పేరును ప్రకటించనుంది. ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే కూడా జిల్లా కార్యదర్శులతో తరచూ సమావేశాలు జరుపుతూ అసెంబ్లీ ఎన్నికలకు వ్యూహరచన చేస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాట ద్రావిడ పార్టీలకు ప్రత్యామ్నా యంగా ఆధ్యాత్మిక రాజకీయాలకు శ్రీకారం చుట్టబోతు న్నానని, అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేసి తీరుతానని ప్రకటించిన రజనీకాంత్ ఇప్పటి వరకూ పార్టీని ప్రారంభించే దిశగా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. లాక్డౌన్ కారణంగా వాయిదాపడుతూ వచ్చిన రాజకీయ ప్రవేశంపై నవంబర్ లేదా డిసెంబర్లో రజనీ ప్రకటన చేస్తారని అందరూ భావించారు. అయితే దేశంలో కరోనా వ్యాప్తి పూర్తిగా తగ్గుముఖం పట్టిన తర్వాతే పార్టీని ప్రారంభించాలని రజనీ నిర్ణయించినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
హైదరాబాద్ జర్నీకి బ్రేక్
‘దర్బార్’ చిత్రం తర్వాత రజనీకాంత్ సిరుతై శివా దర్శకత్వంలో ‘అన్నాత్తే’ చిత్రంలో నటిస్తున్నారు. రజనీతో పాటు నయనతార, ఖుష్బూ, మీనా, కీర్తిసురేష్ తదితరులు నటిస్తున్న ఆ చిత్రం షూటింగ్ హైదరాబాద్లో శరవేగంగా జరుగుతున్నప్పుడే లాక్డౌన్ వచ్చింది. షూటింగ్ అర్థాంతరంగా ఆగిపోయింది. ఈ పరిస్థితులలో వైరస్ వ్యాప్తి ప్రస్తుతం తగ్గుముఖం పడుతుండటంతో ఈ నెల 10న రజనీ ‘అన్నాత్తే’ షూటింగ్లో పాల్గొంటారని వార్తలు వినిపించాయి. ఆ షూటింగ్లో పాల్గొనేందుకు ఈ నెల ఎనిమిదిన చెన్నై నుంచి హైదరాబాద్కు కారులో వెళ్లడానికి తగు ఏర్పాట్లు కూడా జరిగాయి. ఈ విషయం తెలుసుకున్న రజనీ అభిమానుల సంతోషానికి పట్టపగ్గాలు లేక పోయింది. అక్టోబర్లో ప్రారంభమయ్యే ‘అన్నాత్తే’ షూటింగ్ నవంబర్లో పూర్తవుతుందని, డిసెంబర్లో రాజకీయ పార్టీని ప్రారంభిస్తారని రజనీ అభిమానులు, రజనీ మక్కల్ మండ్రం నేతలంతా సంతోషించారు. అయితే ఊహించని విధంగా పార్టీని ప్రారంభించే విషయంగా రజనీ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఈ విషయమై రజనీ మక్కల్ మండ్రం నేతలు మాట్లాడుతూ సినిమా షూటింగ్లకు రాష్ట్ర ప్రభుత్వాలన్నీ అనుమతించి నెల రోజులుదాటినా పెద్ద సినిమాల షూటింగ్లేవీ ప్రారంభం కాలేదని, చిన్న బడ్జెట్ చిత్రాలు, వెబ్సీరీస్, ఓటీటీ ఆంథాలజీ చిత్రాలకు సంబంధించి షూటింగ్లు మాత్రమే జరుగుతున్నాయని తెలిపారు.
సన్నిహితుల సలహా...
రజనీ మళ్ళీ షూటింగ్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారని తెలియగానే సన్నిహితులు, స్నేహితులు ఆయనను కలుసుకున్నారు. తమిళం, తెలుగు, హిందీ సినిమాల షూటింగ్లకు అను మతి లభించినా పెద్ద సంస్థలకు చెందిన షూటింగ్లేవీ జరుగటం లేదని, కమల్హాసన్ కూడా కరోనా నిరోధక నిబంధనల నడుమ బిగ్బాస్ షోలో పాల్గొంటున్నారే తప్ప షూటింగ్కు వెళ్ళలేదని తెలిపారు. వాస్తవాలు ఇలా ఉన్నప్పుడు షూటింగ్లో పాల్గొనేందుకు తొందరపడవద్దని రజనీకి వారంతా సూచించారు. కరోనా పూర్తిగా కట్టడిలోకి వచ్చిన తర్వాత, ఆ వైరస్ మహమ్మారికి టీకా అందుబాటులోకి వచ్చిన తరువాతే షూటింగ్లో పాల్గొనమని సలహా ఇచ్చారు. రజనీ సన్నిహితులు అంతటితో ఆగలేదు. సుప్రసిద్ధ సినీ నేపథ్య గాయకుడు హైదరాబాద్లో జరిగిన టీవీ షో షూటింగ్లో పాల్గొనటం వల్లే ఆయనకు కరోనా సోకిందన్న విషయాన్ని మరువకూడదని తెలిపారు. సన్నిహితుల సలహాలు విన్న రజనీ షూటింగ్లో పాల్గొనకూడదని నిర్ణయించారు. ఆ నిర్ణయాన్ని సినీ నిర్మాణ సంస్థ నిర్వాహకులకు తెలిపారు. నిర్మాతల కూడా రజనీపై ఒత్తిడి చేయడానికి సాహ సించలేకపోయారు. రజనీ అనుమతించిన తర్వాతే షూటింగ్ ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ అంశాలను పరిశీలించినట్లయితే రజనీ డిసెంబర్ వరకు షూటింగ్లకు హాజరుకారని స్పష్టమవుతోంది. వచ్చే యేడాది జనవరిలోనూ రజనీ షూటింగ్లో పాల్గొంటారని తెలుస్తోంది. నెలరోజుల్లో ‘అన్నాత్తే’ షూటింగ్ ముగిసిన తర్వాతే ఫిబ్రవరిలోనే రజనీ రాజకీయ అరంగేట్రం చేస్తారని, పార్టీ పేరును ప్రకటించి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతారని ఆయన సన్నిహితులు స్పష్టం చేశారు.
ప్రత్యేక విమానం...
షూటింగ్లకు ప్రభుత్వాలు అనుమతించి నెలరోజుల దాటడంతో ఇక తాను షూటింగ్లో పాల్గొనక పోతే బాగుండదని భావించిన రజనీ ముందు ‘అన్నాత్తే’ షూటింగ్లో పాల్గొనేందుకు అంగీకరించారు. దీంతో హైదరాబాద్లో షూటింగ్ ప్రారంభించే దిశగా సెట్టింగ్ల నిర్మాణం తదితర పనులన్నీ చురుకుగా జరిగాయి. కరోనా సోకకుండా రజనీకాంత్ను హైదరాబాద్కు తీసుకెళ్ళడానికి ‘అన్నాత్తే’ నిర్మాణ సంస్థ ప్రత్యేకంగా ఛార్టెడ్ విమానాన్ని కూడా సిద్ధం చేసింది. ఆ విమానంలో రజనీతోపాటు నలుగురు మాత్రమే ప్రయాణించేలా ఏర్పాట్లు చేపట్టారు. ఆ పరిస్థితుల్లోనే రజనీ హఠాత్తు గా తన నిర్ణయాన్ని మార్చు కున్నారు.
డిసెంబర్లో ప్రకటన...
ఇక డిసెంబర్ 12న రజనీ పుట్టిన రోజు వేడుకలను జరుపుకోనున్నారు. ఆ సమయంలోనే రాజకీయ పార్టీని ప్రారంభించే విషయమై ఆయన కీలకమైన ప్రకటన చేసే అవకాశం ఉందని సన్నిహితులు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం గురించి, సీఎం అభ్యర్థి ఎంపిక గురించి రజనీ ఆ రోజునే అధికారికంగా ప్రకటిస్తారని, ఎట్టి పరిస్థితుల్లో ఈసారి అభిమానులను, మండ్రం నేతలను నిరాశకు గురిచేయరని తెలిపారు. రజనీ ఫిబ్రవరిలో పార్టీని ప్రారంభించి రెండు నెలలపాటు ఎన్నికల ప్రచార పర్యటనలు చేయనున్నారని చెప్పారు. ఏది ఏమైనప్పటికీ రజనీ అసెంబ్లీ ఎన్నికలలోపు రాజకీయ ప్రవేశం తప్పదని స్పష్టం చేశారు.