అసెంబ్లీ అప్పుడే విప్నకు విలువ
ABN , First Publish Date - 2020-07-18T07:39:16+05:30 IST
సచిన్ పైలట్ సహా.. 19 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై రాజస్థాన్ కాం గ్రెస్ అనర్హత అస్త్రాన్ని ప్రయోగించింది. దీనిపై హైకోర్టులో తాడోపేడో తేల్చుకునేందుకు పైలట్....

పార్టీ భేటీలకు విప్ వర్తించదు
హైకోర్టులో రాజస్థాన్ కాంగ్రెస్ రెబల్స్
జైపూర్, న్యూఢిల్లీ, జూలై 17: సచిన్ పైలట్ సహా.. 19 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై రాజస్థాన్ కాం గ్రెస్ అనర్హత అస్త్రాన్ని ప్రయోగించింది. దీనిపై హైకోర్టులో తాడోపేడో తేల్చుకునేందుకు పైలట్ వర్గం సిద్ధమైంది. పార్టీ విప్ను ధిక్కరించారని, వారిపై అనర్హత వేటు వేయాలంటూ కాంగ్రెస్ చీఫ్విప్ మహేశ్ జోషి అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషికి నోటీసులు ఇచ్చిన విష యం తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా అసంతృప్త ఎమ్మెల్యేలు హైకోర్టులో పిటిషన్ వేశారు. ‘‘కాంగ్రెస్ విప్ను ధిక్కరించామని చెబుతున్నారు. అయితే.. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే పార్టీ విప్నకు విలువ ఉంటుంది. పార్టీ సమావేశాలకు అది వర్తించదు.
ఇక రాజ్యాంగంలోని పదో షెడ్యూల్లోని పేరాగ్రాఫ్ 2(1)(ఏ) ప్రకారం అనర్హత వేటు వేయాలంటున్నారు. అది చెల్లదు. ఎందుకంటే.. పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యేల విషయంలోనే అది చెల్లుబా టు అవుతుంది. మేము కాంగ్రె్సను వీడామని ఎన్నడూ చెప్పలేదు’’ అని హైకోర్టుకు వివరించారు. పిటిషన్ను విచారించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇం దర్ జిత్ మహంతి, జస్టిస్ ప్రకాశ్ గుప్తాల ధర్మాసనం.. శనివారం దీనిపై స్పందించాలంటూ కాంగ్రెస్ చీఫ్విప్ మహేశ్ జోషిని ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. అప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయవద్దని స్పీకర్ సీపీ జోషి తరఫు న్యాయవాదిని ఆదేశించింది.
చిక్కుల్లో కేంద్ర మంత్రి షెకావత్!
ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వాయి్సతో ఉన్న రెండు ఆడియో క్లిప్పులు బహిర్గతమవ్వడం రాజస్థాన్ రాజకీయాల్లో మరింత కలకలం సృష్టించింది. దీనిపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్ సూర్జేవాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గెహ్లోత్ సర్కారును కూల్చివేసేందుకు బీజేపీ పన్నిన కుట్రకు ఇవే ఆధారాలు అని చెప్పారు. ఆడియో టేపుల కలకలం తర్వాత కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలు భన్వారీలాల్ శర్మ, విశ్వేంద్రసింగ్లను సస్పెండ్ చేసింది. దీంతో గెహ్లోత్ సర్కారు మరింత చిక్కుల్లో పడనుంది. ఆడియో టేపుల్లో ఉన్నది తన వాయిస్ కాదని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షె కావత్ అన్నారు. కాగా, ఆడియో టేపుల వ్యవహారంపై రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. అయితే.. వాటిల్లో షెకావత్ పేరు లేకపోవడం గమనార్హం. కాగా, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి సచిన్ పైలట్ ఫోన్ చేశా రు. తనతోపాటు, తనవారిని కాపాడుకునేందుకు సల హా ఇవ్వాలని ఆయనను కోరారు. దానికి ఆయన పార్టీ నేతలను కలిస్తే సమస్యలన్నీ తీరుతాయని చెప్పారు.