వచ్చే వారమే బల నిరూపణ.. సిద్ధమైపోయిన గెహ్లోత్!
ABN , First Publish Date - 2020-07-19T15:02:22+05:30 IST
ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమైపోయినట్లు సమాచారం. వచ్చే

జైపూర్ : ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమైపోయినట్లు సమాచారం. వచ్చే వారమే బల నిరూపణకు దిగనున్నట్లు తెలుస్తోంది. వచ్చే వారంలో అసెంబ్లీని సమావేశ పరచి, బల నిరూపణ చేసుకోవాలని సీఎం గెహ్లోత్ తల పోసినట్లు రాజస్థాన్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే మంగళవారం దీనిపై అధికారికంగా ఓ ప్రకటన వెలువడే అవకాశాలున్నట్లు సమాచారం. తిరుగుబాటు నేత సచిన్ పైలట్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించనుంది. ఈ విషయాన్ని కూడా సీఎం గెహ్లోత్ పరిగణనలోకి తీసుకోనున్నట్లు కొందరు నేతలు పేర్కొన్నారు.
బహుజన ట్రైబల్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు గెహ్లోత్కు మద్దతిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో తమ బలం మేజిక్ ఫిగర్ దాటిందంటూ సీఎం గెహ్లోత్ శనివారం సాయంత్రం గవర్నర్ కల్రాజ్ మిశ్రాను కలుసుకున్నారు. అంతేకాకుండా బీటీపీ ఎమ్మెల్యేల మద్దతు పత్రాలతో పాటు తమకున్న బలాన్ని పేర్కొంటూ ఓ లేఖను అందజేశారు. ఈ పరిణామాల తర్వాతనే సీఎం బల నిరూపణ నిరూపించుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు సమాచారం.