కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రాజస్థాన్లో బిల్లులు
ABN , First Publish Date - 2020-10-31T22:03:37+05:30 IST
కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల
జైపూర్ : కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను అమలు చేయవలసిన అవసరం లేకుండా చేయడానికి రాజస్థాన్ 3 బిల్లులను ప్రతిపాదించింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శాంతి ధారివాల్ ఈ బిల్లులను శాసన సభలో ప్రవేశపెట్టారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, తదితరుల మృతికి సంతాపం తెలిపిన తర్వాత సభ వాయిదా పడింది.
నిత్యావసర వస్తువులు (ప్రత్యేక నిబంధనలు, రాజస్థాన్ సవరణ) బిల్లు, 2020; ధరల హామీ, వ్యవసాయ సేవల (రాజస్థాన్ సవరణ)పై రైతుల (సాధికారత, పరిరక్షణ) ఒప్పందం బిల్లు, 2020; వ్యవసాయోత్పత్తుల వ్యాపార, వాణిజ్య (ప్రోత్సాహం, సదుపాయం, రాజస్థాన్ సవరణ) బిల్లు, 2020లను శాంతి ధారివాల్ ప్రతిపాదించారు.
కెప్టెన్ అమరీందర్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వం కూడా కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా బిల్లులను ఆమోదించింది. ఈ బిల్లులపై చర్చించేందుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అపాయింట్మెంట్ను కెప్టెన్ అమరీందర్ సింగ్ కోరారు. నవంబరు 2-5 తేదీల మధ్యలో అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరారు.