రైళ్లలో పాంట్రీ కార్ల స్థానే ఏసీ-3 కోచ్లు
ABN , First Publish Date - 2020-10-20T00:53:49+05:30 IST
కరోనా మహమ్మారి తలెత్తినప్పటి నుంచి రైళ్లలో ఆహారం సరఫరాను నిలిపివేసిన భారతీయ రైల్వే తాజాగా పాంట్రీ కార్లను థర్డ్ ఏసీ..

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి తలెత్తినప్పటి నుంచి రైళ్లలో ఆహారం సరఫరాను నిలిపివేసిన భారతీయ రైల్వే తాజాగా పాంట్రీ కార్లను థర్డ్ ఏసీ కోచ్లుగా మార్చే ఆలోచనలో ఉంది. వనరుల వృథాను నివారించేందుకు ఇండియన్ రైల్వే ఈ చర్య తీసుకోనుంది. 300 రైళ్లలో పాంట్రీ కార్లను ఏసీ-3 కోచ్లుగా మార్చనున్నట్టు తెలుస్తోంది.
ప్రయాణికుల కోసం రైళ్లలో ఆహారం సిద్ధ చేసి, సరఫరా చేయడం పాంట్రీ కార్ల ముఖ్యోద్దేశం. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నప్పటికీ ప్రయాణికుల ఆరోగ్యరీత్యా పాంట్రీ కార్ సర్వీసులను నిలిపేసింది. పాంట్రీ సిస్టంకు బదులుగా ప్రతీ ప్రధాన స్టేషన్లో ఐఆర్సీటీసీ ఆధారిత కిచన్లు ఏర్పాటు చేసి ప్రయాణికుల ఆహార అవసరాలను రైల్వేలు తీరుస్తాయి. పాంట్రీ కార్లలో లభించే పదార్ధాలే ఇక్కడ కూడా అందుబాటులో ఉంటాయి. కొత్తగా అనుకుంటున్న కిచన్ సిస్టమ్లో ప్యాసింజర్లు ఆన్లైన్లో ఆహారం కోసం ఆర్డర్ ఇచ్చే సదుపాయం ఉంటుంది. రైల్వేలు తీసుకురానున్న కొత్త సిస్టంతో సంస్థకు ఆదాయం పెరగడంతో పాటు క్యాటరింగ్ సదుపాయం కూడా విస్తరిస్తుంది.