అదో ముగిసిన అధ్యాయం : రాహుల్ గాంధీ

ABN , First Publish Date - 2020-05-08T20:52:21+05:30 IST

అధ్యక్ష బాధ్యతలు తిరిగి చేపట్టడంపై ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

అదో ముగిసిన అధ్యాయం : రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ : అధ్యక్ష బాధ్యతలు తిరిగి చేపట్టడంపై ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఆయన శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విలేకరులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ‘కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు తిరిగి చేపడతారా?’ అన్న ప్రశ్నకు ఆయన స్పందించారు.


‘‘నేను రాసిచ్చిన ఉత్తరానికి బద్ధుడ్నై ఉంటా. అది ముగిసిన అధ్యాయం. ఆ విషయంలో నా వైఖరేంటి అనేది ఉత్తరంలోనే తెలిపా. అది ముగిసిన అధ్యాయం’’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థపై రాహుల్ గాంధీ ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ రాజన్, నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అలాగే వివిధ రంగాల ప్రముఖులతో రాహుల్ సంభాషించారు.


ఈ నేపథ్యంలో అధ్యక్షత బాధ్యతల్లోకి రాహుల్ తిరిగి రానున్నారన్న ప్రచారం విపరీతంగా జరిగింది. దీనిపై కూడా రాహుల్ స్పందించారు. ‘‘చాలా మంది ప్రముఖులతో నేను సంభాషించా. ఆ సంభాషణలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. వాటిని సంగ్రహించి దేశ ప్రజల ముందు ఉంచాలనుకుంటున్నా. అంతేకానీ అందులో ఎలాంటి వ్యూహమూ లేదు.’’ అని రాహుల్ స్పష్టం చేశారు. 


గత సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓటమి చవిచూడటంతో ఓ ఉత్తరం రాసి రాహుల్ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ‘‘2019 సార్వత్రిక ఎన్నికల పరాజయానికి బాధ్యత వహిస్తూ అధ్యక్ష బాధ్యతకు రాజీనామా చేస్తున్నా. ఆ పరాజయానికి నేనే బాధ్యుడ్ని. పార్టీకి నా సేవలు ఎప్పుడు అవసరమైనా నేను వారికి అందుబాటులో ఉంటా. సలహాలు కూడా ఇస్తుంటా’’ అని రాహుల్ ఆ లేఖలో పేర్కొన్నారు. 

Updated Date - 2020-05-08T20:52:21+05:30 IST