కొత్త చట్టాలపై నిరసన : బుధవారం రాజ్‌ఘాట్ వద్ద పంజాబ్ సీఎం ధర్నా

ABN , First Publish Date - 2020-11-04T00:50:21+05:30 IST

పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ బుధవారం ఢిల్లీలోని రాజ్‌ఘాట్

కొత్త చట్టాలపై నిరసన : బుధవారం రాజ్‌ఘాట్ వద్ద పంజాబ్ సీఎం ధర్నా

న్యూఢిల్లీ : పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ బుధవారం ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద ధర్నా చేయబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా అమల్లోకి తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ నిర్వహించే ఈ ధర్నాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాల్గొంటారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంతో కెప్టెన్ సింగ్ ఈ నిర్ణయం తీసున్నారు. 


నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ, పంజాబ్ శాసన సభ ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలపాలని కోరేందుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలవాలని కెప్టెన్ సింగ్ ప్రయత్నించారు. రాష్ట్రపతిని కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరారు. అయితే కెప్టెన్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేల ప్రతినిథి బృందానికి అపాయింట్‌మెంట్ ఇచ్చేందుకు రాష్ట్రపతి భవన్ నిరాకరించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ చట్టాలపై నిరసన తెలియజేసేందుకు ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద ధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ధర్నాలో ఆయనతోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాల్గొంటారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కూడా ఆయన ఈ ధర్నాకు ఆహ్వానించారు. పంజాబ్‌లో గూడ్స్ రైళ్ళను కేంద్ర ప్రభుత్వం నిలిపేయడం వల్ల ఎదురవుతున్న సమస్యలను ఈ ధర్నాలో వివరిస్తామని కెప్టెన్ సింగ్ చెప్పారు. 


కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతులు తమ నిరసన కార్యక్రమాల్లో భాగంగా రైల్వే ట్రాక్‌లపై అడ్డంకులు పెడుతున్నారని, అందుకే పంజాబ్‌లో గూడ్స్ రైళ్ళను నిలిపేశామని రైల్వే శాఖ తెలిపింది. 


Updated Date - 2020-11-04T00:50:21+05:30 IST