హత్రాస్లో నిషేధాజ్ఞలు... జిల్లా సరిహద్దులు మూసివేత...
ABN , First Publish Date - 2020-10-01T18:04:28+05:30 IST
ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లాలో జరిగిన సామూహిక అత్యాచారం, హత్యపై తీవ్ర నిరసన పెల్లుబుకడంతో..
హత్రాస్: ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లాలో జరిగిన సామూహిక అత్యాచారం, హత్యపై తీవ్ర నిరసన పెల్లుబుకడంతో.. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అధికార యంత్రాంగం ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి నిషేధాజ్ఞలు విధిస్తున్నట్టు కలెక్టర్ పీకే లక్షకర్ ప్రకటించారు. ‘‘జిల్లాలో సెక్షన్ 144 విధించాం. ఈ నెల 31 వరకు ఇది అమల్లో ఉంటుంది...’’ అని ఆయన గురువారం ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు హత్రాస్ జిల్లా సరిహద్దులను కూడా మూసివేస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. గత నెల 14న హత్రాస్లోని ఓ గ్రామంలో 19 ఏళ్ల దళిత బాలికపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడి, తీవ్రంగా గాయపర్చారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఢిల్లీలోని సఫ్తర్ గంజ్ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు చికిత్స పొందుతూనే మంగళవారం కన్నుమూసింది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు భగ్గుమనడంతో రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి ముమ్మర విచారణ చేపట్టింది.