ప్రియాంకగాంధీ లోధిరోడ్ బంగ్లా నుంచి సామాన్ల తరలింపు
ABN , First Publish Date - 2020-07-10T16:58:58+05:30 IST
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ గడువుకు ముందే ఢిల్లీలోని లోథీరోడ్ లోని ప్రభుత్వ బంగళాను ఖాళీ చేస్తున్నారు....
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ గడువుకు ముందే ఢిల్లీలోని లోథీరోడ్ లోని ప్రభుత్వ బంగళాను ఖాళీ చేస్తున్నారు. ప్రియాంకాగాంధీ తన వ్యక్తిగత సామాన్లను తన తల్లి సోనియాగాంధీ నివాసమున్న జనపథ్ లోని 10వనంబరు బంగళాకు తరలించారు. ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాను ఆగస్టు 1 నాటికి ఖాళీ చేయాలని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రియాంక లోధి ఎస్టేట్లోని 35వ నెంబర్ ప్రభుత్వ బంగ్లాలో నివాసముంటోంది. ఇటీవల ఆమెకు కేంద్ర ప్రభుత్వం ఎస్పీజీ భద్రతను తొలగించింది. ఈ నేపథ్యంలో లోథీ రోడ్లోని ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని పట్టణ, గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ బుధవారం ఆమెకు రాసిన లేఖలో పేర్కొంది.దీంతో ప్రియాంకా తన లోథి రోడ్ లోని తన ఇంటి సామాన్లను తల్లి ఇంటికి తరలించారు. ప్రియాంకా వాద్రా తన మకాంను యూపీ లక్నో నగరానికి మకాం మార్చాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇందిరాగాంధీ సమీపబంధువు అయిన కేంద్ర మాజీ మంత్రి షీలాకౌల్ లక్నోలో ఓ భవనముంది. కౌల్ హౌస్ బంగళాను ప్రియాంక నివాసముండేందుకు దాన్ని తాజాగా మరమ్మతులు చేయించారని లక్నో కాంగ్రెస్ వర్గాలు చెపుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం యూపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు వీలుగా తాను ఢిల్లీ నుంచి లక్నోకు మకాం మార్చాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఢిల్లీలోని తల్లి సోనియాగాంధీ ఇంట్లోనూ, ఇటు లక్నోలోని కౌల్ హౌస్ లోను ఉండాలని ప్రియాంకా భావిస్తున్నట్లు సమాచారం.