ఉత్తర ప్రదేశ్లో ఆటవిక రాజ్యం వికృత రూపం : ప్రియాంక గాంధీ
ABN , First Publish Date - 2020-08-01T16:56:33+05:30 IST
ఉత్తర ప్రదేశ్లో శాంతిభద్రతల పరిస్థితులు దిగజారుతున్నాయని కాంగ్రెస్ ప్రధాన

న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్లో శాంతిభద్రతల పరిస్థితులు దిగజారుతున్నాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. రాష్ట్రంలో ఆటవిక పాలన పెరుగుతోందని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వంపై శనివారం ఆమె తీవ్రంగా మండిపడ్డారు.
బులంద్ షహర్కు చెందిన న్యాయవాది ధర్మేంద్ర చౌదరి అనుమానాస్పద మృతి నేపథ్యంలో ప్రియాంక ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘ఉత్తర ప్రదేశ్లో ఆటవిక పాలన వృద్ధి చెందుతోంది. నేరాలు, కరోనా చేయి దాటిపోయాయి. ధర్మేంద్ర చౌదరిని ఎనిమిది రోజుల క్రితం బులంద్ షహర్ నుంచి అపహరించారు. ఆయన మృతదేహం నిన్న (శుక్రవారం) కనిపించింది. కాన్పూరు, గోరఖ్పూర్, బులంద్ షహర్ - ప్రతి సంఘటనలోనూ శాంతిభద్రతల నిర్లిప్తత. ఆటవిక రాజ్యం గుర్తులు. ఇంకా ఎంత కాలం ఈ ప్రభుత్వం నిద్రపోతుందో’’ అని ప్రియాంక ట్వీట్ చేశారు.
న్యాయవాది ధర్మేంద్ర చౌదరిని జూలై 25న అపహరించారు. ఆయన మృతదేహం జూలై 31న కనిపించింది.