గవర్నర్లతో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి వీడియో కాన్ఫరెన్స్
ABN , First Publish Date - 2020-03-27T18:21:51+05:30 IST
రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఇవాళ దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన గవర్నర్లు, లెఫ్టినెంట్...
న్యూఢిల్లీ: రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఇవాళ దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించిన ఆయన... ప్రాణాంతక మహమ్మారి కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న సహాయక చర్యల అమలుపై చర్చించారు. కరోనా వైరస్ రోజు రోజుకూ విస్తరిస్తున్న దీని కట్టడికి తీసుకోవాల్సిన చర్యల గురించి గవర్నర్లకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లతో పాటు ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. కాగా కోవిడ్-19 సవాలు ఎదుర్కొనేందుకు దేశ వ్యాప్తంగా వైద్య నిపుణులు, ఇతర అత్యవసర సేవల సిబ్బంది చేస్తున్న కృషిపై రాష్ట్రపతి ప్రశంసలు కురిపించారు. కాగా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 724కు చేరగా... 17 మంది ప్రాణాలు కోల్పోయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.