కరోనా ఆంక్షలు వద్దంటూ.. దగ్గుతూ దేశాధ్యక్షుడి స్పీచ్
ABN , First Publish Date - 2020-04-22T01:05:05+05:30 IST
ప్రపంచం మొత్తం కరోనాపై పోరుకు నడుంకట్టి.. ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రావొద్దని లాక్డౌన్లు విధిస్తుంటే, ఇది తప్పంటూ ఓ దేశాధ్యక్షుడు ఆందోళనకు దిగారు.

బ్రసిల్లా: ప్రపంచం మొత్తం కరోనాపై పోరుకు నడుంకట్టి.. ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రావొద్దని లాక్డౌన్లు విధిస్తుంటే, ఇది తప్పంటూ ఓ దేశాధ్యక్షుడు ఆందోళనకు దిగారు. ఆయనెవరో కాదు.. వివాదాస్పద వ్యాఖ్యలతో ఎక్కువగా వార్తల్లో నిలిచే బ్రెజిల్ దేశాధ్యక్షుడు జైర్ బొల్సొనారో. ఇలా లాక్డౌన్లు విధించడం మానవుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించి వేస్తాయని బొల్సొనారో వ్యాఖ్యానించారు. ఈ మేరకు కరోనా నియంత్రణ కోసం ప్రజలపై విధించిన ఆంక్షలు ఎత్తివేయాలంటూ జరిగిన ఓ ఆందోళనలో ఆయన స్వయంగా పాల్గొన్నారు. కనీసం మాస్కు కూడా లేకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్న బొల్సొనారో.. ఉపన్యాసం ఇస్తున్న సమయంలో బొల్సొనారో విపరీతంగా దగ్గుతూ కనిపించారు. ఆందోళనలో పాల్గొంటున్న వారంతా గొప్ప దేశభక్తులని, వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడటానికి వాళ్లంతా పోరాడుతున్నారని కొనియాడారు. ఓ దేశాధ్యక్షుడు ఇలా మాట్లాడటం విమర్శలకు దారితీసింది. అయితే బొల్సొనారో విపరీతంగా దగ్గడం చూసిన వారు, ఆయన ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, బ్రెజిల్లో ఇప్పటి వరకు సుమారు 41వేల కరోనా కేసులు నమోదవగా 2600మంది వరకూ మృత్యువాత పడ్డారు.