క్లాజుల వారీగా చర్చలకు సిద్ధం
ABN , First Publish Date - 2020-12-15T07:55:09+05:30 IST
సాగు చట్టాల్లోని అంశాల వారీగా రైతులతో సమగ్ర చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు కేం ద్రం ప్రకటించింది. ‘రైతులతో మాట్లాడుతున్నాం.

రైతులతో ఎప్పుడైనా భేటీ.. కొత్తగా ఎంఎస్పీకి చట్టం అనవసరం: కేంద్రం
రోజంతా దీక్ష చేపట్టిన రైతు నేతలు
పంజాబ్, హరియాణాల్లో నిరసన హోరు
జైపూర్-ఢిల్లీ హైవే దిగ్బంధం
న్యూఢిల్లీ, డిసెంబరు 14: సాగు చట్టాల్లోని అంశాల వారీగా రైతులతో సమగ్ర చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు కేం ద్రం ప్రకటించింది. ‘రైతులతో మాట్లాడుతున్నాం. మరో రౌండు చర్చలు జరుగుతాయి. వారు క్లాజుల వారీగా అభ్యంతరాలు తెలిపితే చర్చిస్తాం. అవసరమైన సవరణలకూ సిద్ధం’’ అని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్ మీడియాకు చెప్పారు. రైతులు కోరుకుంటున్నట్లు గా చట్టాలను రద్దు చేసే అవకాశం లేదని ఆయన పునరుద్ఘాటించారు. ఇంతవరకు 40యూనియన్లతో 5 రౌండ్లు జరిపిన చర్చల్లో ఏ ఫలితమూ రాలేదు.
తోమర్ను సోమవారం హరియాణాకు చెందిన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిశారు. రైతుల ఆందోళన ముగియకుంటే నియోజకవర్గాల్లో ఇబ్బంది తప్పదన్నారు. ఈ సమావేశం తరువాత తోమర్ హోంమంత్రి అమిత్ షాతో చర్చించారు. అటు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఫిక్కి సమావేశంలో వ్యవసాయ చట్టాలను సమర్థించుకొచ్చారు.కాగా, సాగు బిల్లుల రూపకల్పనకు ముందు రైతు నాయకులను గానీ, సంఘాలను గానీ సంప్రదించకపోవ డం తప్పేనని హోంమంత్రి అమిత్ షా అంగీకరించారని రైతు నేత శివకుమార్ శర్మ కాకాజీ వెల్లడించారు. ‘డిసెంబరు 8వ తేదీ రాత్రి అమిత్ షా మమ్మల్ని చర్చలకు పిలిచారు. బిల్లుల రూపకల్పనకు ముందే మాట్లాడితే ఇంత ఆందోళన జరిగేది కాదనీ, మొదట మాట్లాడకపోవడం తప్పేనని, రైతుల క్షేమం, ఆదాయ వృద్ధి, దళారుల వ్యవస్థ రూపుమాపడం కోసం వీటిని తెస్తున్నందున అం దరికీ ఆమోదయోగ్యం కాగలవని భావించామని ఆయన చెప్పారు. తరువాత మాకు ప్రతిపాదనలు పంపుతానన్నారు’’ అని కాకాజీ పేర్కొన్నారు. అయితే ఈ మాటలు షా అన్నదీ లేనిదీ హోంశాఖ వర్గాలు ధ్రువీకరించలేదు.
కాగా ఎంఎస్పీ కోసం ప్రత్యేకంగా ఎలాంటి చట్టమూ చేయనవసరం లేదని కేంద్రం మరోమారు స్పష్టం చేసింది. దేశంలో అత్యఽధిక సంఖ్యలో రైతులు కొత్త చట్టాలకు మద్దతిస్తున్నారని వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పురుషోత్తమ్ రూపాల ముంబైలో చెప్పారు. దేశంలోని 99ు రైతులు చట్టాలకు అనుకూలమని, కాంగ్రెస్ సారథ్యంలో ప్రతిపక్షాలు కొందరు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్సింగ్ కూడా జైపూర్లో అన్నారు. కాగా, సోమవారం అఖిలభారత రైతు సమన్వయ సంఘానికి చెందిన కొందరు రైతు నేతలు మంత్రి తోమర్ను కలిసి చట్టాలకు తాము అనుకూలమంటూ వినతిపత్రం ఇచ్చారు. ఇలా అనుకూలతను తెలియజేసిన నాలుగో సంఘమిది. మరోవైపు ఆందోళన చేస్తున్న రైతుల తరఫున వారి సంఘాల నాయకులు 33 మంది సంఘూ, టిక్రీ సరిహద్దు పాయింట్ల వద్ద సోమవారం నిరాహార దీక్ష చేశారు. చట్టాలను రద్దు చేయాలన్న డి మాండ్పై వెనక్కి తగ్గేది లేదన్నా రు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా రైతులకు సంఘీభావంగా దీక్ష చేశారు. ఉపముఖ్యమంత్రి సిసోడియా, ఆప్ నేతలు కూడా నిరశన చేశారు. అటు పంజాబ్, హరియాణల్లోని అనేక జిల్లాల్లో రైతులు చట్టాలకు వ్యతిరేకంగా ప్రదర్శన లు జరిపారు.మరోపక్క రైతులు ఢిల్లీ-జైపూర్ మార్గాన్ని పలుచోట్ల దిగ్బంధం చేశారు. ఆల్వార్ జిల్లాలోని షాజహాన్పూర్ వద్ద వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతూనే ఉంది. హరియాణ, యూపీ, రాజస్థాన్, పంజాబ్ల వైపు వెళ్లే మార్గాలు ఇప్పటికీ మూసి ఉన్నాయి.
కొడుకును కాపాడుకునేందుకు కేంద్రంతో అమరీందర్ కుమ్మక్కు: కేజ్రీ
పంజాబ్, ఢిల్లీ సీఎంల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. రైతులకు సంఘీభావంగా కేజ్రీవాల్ చేసిన నిరాహార దీక్షను పెద్ద డ్రామాగా పంజాబ్ సీఎం అమరీందర్సింగ్ వర్ణించారు. తమ రాష్ట్ర రైతులు ఢిల్లీ శివార్లలో చలిలో నిరసన చేస్తుం టే ఇలాంటి నాటకాలాడేందుకు సిగ్గు లేదా అని దుమ్మెత్తారు. దీనిపై ‘నేను కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాను. అమరీందర్ తన కొడుకును ఈడీ కేసు నుంచి తప్పించడానికి కేంద్రంతో కుమ్మక్యయ్యారు’ అని కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు.
ఆమరణ దీక్ష చేస్తా: అన్నా
రైతుల డిమాండ్ల పరిష్కారాన్ని కోరుతూ తాను మళ్లీ ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని సంఘ సేవకుడు అన్నా హజారే కేంద్రాన్ని హెచ్చరించారు. రైతు సమస్యల పరిష్కారాన్ని కోరుతూ, స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలంటూ అన్నా హజారే నిరుడు ఫిబ్రవరిలో ఆమరణ దీక్ష చేశా రు. వ్యవసాయ ఖర్చులు, ధరవరల కమిషన్కు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలన్నది అందులో ఒకటి. దానిపై ఓ ఉన్నతస్థాయి కమిటీ వేస్తున్నట్లు అప్పటి వ్యవసాయ మంత్రి రాధామోహన్సింగ్ హామీ ఇవ్వడంతో అన్నా దీక్ష విరమించారు. ఆ కమిటీ తేల్చిందేమీ లేదంటూ నాటి లేఖను జతచేస్తూ హజారే తాజాగా నరేంద్ర తోమర్కు లేఖ రాశారు.
