‘పంజాబ్ బాధిత’ కుటుంబాన్ని రాహుల్ పరామర్శించరా? జవదేకర్
ABN , First Publish Date - 2020-10-24T19:09:34+05:30 IST
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, రాహుల్, ప్రియాంక పై కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తీవ్రంగా మండిపడ్డారు. పంజాబ్లో ఆరేళ్ల దళిత బాలికపై అత్యాచారం

న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, రాహుల్, ప్రియాంక పై కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తీవ్రంగా మండిపడ్డారు. పంజాబ్లో ఆరేళ్ల దళిత బాలికపై అత్యాచారం జరిగినా పరామర్శించడానికి వారందరూ ఎందుకు వెళ్లలేదని ఆయన సూటిగా ప్రశ్నించారు.
‘‘రాహుల్ గాంధీ ‘పొలిటికల్ టూర్స్’ ను ఆపేయాలి. వెంటనే పంజాబ్లోని తాండా గ్రామంలో ఉన్న బాధిత కుటుంబాన్ని పరామర్శించాలి. పంజాబ్ లో మహిళలపై జరుగుతున్న నేరాలను తెలుసుకోవాలి. యూపీలో హాథ్రస్ ఘటన సందర్భంలో బీజేపీని తీవ్రంగా విమర్శించిన వారు ఇప్పుడెందుకు మాట్లాడటం లేదు. తాండా బాధిత కుటుంబాన్ని సోనియా, రాహుల్, ప్రియాంక పరామర్శించలేదు. తమ పార్టీ పాలిస్తున్న రాష్ట్రాల్లో మహిళలకు జరిగిన అన్యాయాన్ని వారు పట్టించుకోరు. కానీ... ఫొటోల కోసం మాత్రం హాథ్రస్ లాంటి ప్రాంతాలకు వెళతారు.’’ అని జవదేకర్ దుయ్యబట్టారు. తాండా గ్రామంలోని ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేయడం షాకింగ్ కు గురిచేసే సంఘటన అని, నిందితులను కఠినంగా శిక్షించాలని జవదేకర్ డిమాండ్ చేశారు.