ఒలింపిక్స్ వాయిదా తప్పదేమో: జపాన్ ప్రధాని

ABN , First Publish Date - 2020-03-23T22:47:36+05:30 IST

ప్రపంచ క్రీడా సంబరం ఒలిపింక్స్‌కు కూడా కరోనా సెగ తాకింది. కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా.. జపాన్‌లో జరగాల్సిన ఒలింపిక్స్‌ను వాయిదా వేసే యోచనలో ఉన్నట్లు జపాన్ ప్రధాని షింజో అబె తెలిపారు.

ఒలింపిక్స్ వాయిదా తప్పదేమో: జపాన్ ప్రధాని

టోక్యో: ప్రపంచ క్రీడా సంబరం ఒలిపింక్స్‌కు కూడా కరోనా సెగ తాకింది. ఈ ఏడాది జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు ఒలింపిక్స్ జరగాల్సి ఉంది. అయితే కరోనా వ్యాప్తి వల్ల ఒలింపిక్స్‌ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. అసలు ఈ క్రీడా సంబరం జరుగుతుందా? అనే ప్రశ్నలు తలెత్తాయి. ఈ క్రమంలో ఒలింపిక్స్‌ను వాయిదా వేసే యోచనలో ఉన్నట్లు జపాన్ ప్రధాని షింజో అబె తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన చేశారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో టోక్యో ఒలింపిక్స్‌ను పూర్తి స్థాయిలో నిర్వహించలేకపోతే వాయిదా వేయక తప్పదేమో’ అని అబె అన్నారు. అయితే ఒలింపిక్స్‌ను రద్దు చేసే అవకాశం మాత్రం అస్సలు లేదని స్పష్టంచేశారు. కాగా, ఒలింపిక్స్ నిర్వహణకు ఉన్న వివిధ మార్గాలపై చర్చిస్తున్నామని అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య ఆదివారం వెల్లడించింది. అవసరమైతే ఒలింపిక్స్‌ను వాయిదా వేస్తామని ప్రకటించింది. కాగా, ఇటీవలే టోక్యోలో ఒలింపిక్ జ్యోతిని ఆవిష్కరించారు. కరోనా కట్టడి అమల్లో ఉన్నప్పటికీ ఈ కార్యక్రమానికి దాదాపు 50వేలమంది క్రీడాభిమానులు హాజరవడం విశేషం.

Updated Date - 2020-03-23T22:47:36+05:30 IST