రాజకీయాలు దేశాభివృద్ధికి ఆటంకంగా మారకూడదు : మోదీ

ABN , First Publish Date - 2020-12-29T22:45:15+05:30 IST

రాజకీయాలు దేశాభివృద్ధికి ఆటంకంగా మారకూడదని ప్రధాన

రాజకీయాలు దేశాభివృద్ధికి ఆటంకంగా మారకూడదు : మోదీ

న్యూఢిల్లీ : రాజకీయాలు దేశాభివృద్ధికి ఆటంకంగా మారకూడదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధికి రాజకీయాలను దూరంగా ఉంచాలన్నారు. దేశ మౌలిక సదుపాయాలు ఓ ప్రస్థానంగా కొనసాగాలని, ఐదేళ్ళ రాజకీయాల కోసం కాకుండా అనేక తరాలకు లబ్ధి చేకూర్చేందుకు ఈ ప్రస్థానం జరగాలని అన్నారు. ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ఆపరేషన్ కంట్రోల్ సెంటర్‌ను, న్యూ భావ్‌పూర్-న్యూ ఖుర్జా సెక్షన్‌ను  మంగళవారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించిన అనంతరం మోదీ మాట్లాడారు. 


దేశంలోని మౌలిక సదుపాయాల అభివృద్ధిని రాజకీయాలకు దూరంగా ఉంచాలని మోదీ పిలుపునిచ్చారు. దేశంలో మౌలిక సదుపాయాల ప్రస్థానం అనేక తరాలకు లబ్ధి చేకూర్చేందుకు జరగాలని, ఐదేళ్ళ రాజకీయాల కోసం కాదని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు పోటీ పడాలనుకుంటే, మౌలిక సదుపాయాల నాణ్యత, వేగం, విస్తృతి కోసం పోటీ పడాలని తెలిపారు. ఏ దేశ పటిష్ఠతకైనా ప్రధాన ఆధారం మౌలిక సదుపాయాలేనని పేర్కొన్నారు. 


న్యూ ఖుర్జా రైల్ సెక్షన్‌లో మొదటి ఫ్రైట్ ట్రైన్ పరుగులు తీయడంతో భారతీయ రైల్వేల గత కీర్తికి నేడు (మంగళవారం) 21వ శతాబ్దపు ప్రత్యేకత లభించిందన్నారు. స్వయం సమృద్ధ నవ భారతం నినాదం స్పష్టంగా వినిపిస్తోందన్నారు. భారత దేశం ప్రపంచంలో గొప్ప ఆర్థిక శక్తిగా అవతరించే మార్గంలో దూసుకెళ్తోందని, అత్యుత్తమ అనుసంధానం మన దేశానికి చాలా ముఖ్యమైనదని చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆధునిక అనుసంధానానికి సంబంధించిన ప్రతి అంశంలోనూ గత ఆరు సంవత్సరాల నుంచి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. 


హైవేస్, రైల్వేస్, ఎయిర్‌వేస్, వాటర్‌వేస్, ఐ-వేస్ అనే ఐదు చక్రాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెడుతోందన్నారు. ఈ దిశలో మంగళవారం ప్రారంభమైన భారీ ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ గొప్ప ముందడుగు అని వివరించారు. ఒకే ట్రాక్‌పై ప్యాసింజర్ రైళ్లు, గూడ్స్ రైళ్లు నడిచేటపుడు గూడ్స్ రైళ్లు నెమ్మదిగా నడవడం, మధ్య మధ్యలో అంతరాయాలు ఏర్పడటం వల్ల రవాణా ఖర్చు కచ్చితంగా ఎక్కువగా ఉంటుందన్నారు. దీని వల్ల మన ఉత్పత్తులు మన మార్కెట్లలోనూ, విదేశీ మార్కెట్లలోనూ పోటీని తట్టుకోలేకపోతున్నట్లు తెలిపారు. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్  ఈ పరిస్థితిని మార్చుతుందన్నారు. 


ప్రజాస్వామిక హక్కుతోపాటు బాధ్యతను గుర్తించాలి 

ప్రజలు తమ నిరసనను తెలియజేసేటపుడు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేయరాదని మోదీ పిలుపునిచ్చారు. ఉద్యమాలు, ప్రదర్శనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించేవారు దేశం పట్ల తమకుగల బాధ్యతను మర్చిపోకూడదని చెప్పారు. తమ ప్రజాస్వామిక హక్కును వెల్లడించేటపుడు పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేయరాదని తెలిపారు. 


Updated Date - 2020-12-29T22:45:15+05:30 IST