నా భర్త తప్పు చేశాడు

ABN , First Publish Date - 2020-07-12T07:13:06+05:30 IST

‘‘నా భర్త తప్పు చేశాడు.. ఈ శిక్షకు అర్హుడే’’ అని గ్యాంగ్‌ స్టర్‌ వికాస్‌ దూబే భార్య రిచాదూబే వ్యాఖ్యానించారు. ఈ నెల 3న ఎనిమిది మంది పోలీసులను పాశవికంగా కాల్చి చంపిన కేసులో ప్రధాన నిందితుడైన వికాస్‌ దూబే...

నా భర్త తప్పు చేశాడు

  • పోలీసులు విధించిన శిక్షకు అర్హుడే
  • ఎన్‌కౌంటర్‌పై వికాస్‌ దూబే భార్య వ్యాఖ్యలు

కాన్పూర్‌, జూలై 11: ‘‘నా భర్త తప్పు చేశాడు.. ఈ శిక్షకు అర్హుడే’’ అని గ్యాంగ్‌ స్టర్‌ వికాస్‌ దూబే భార్య రిచాదూబే వ్యాఖ్యానించారు. ఈ నెల 3న ఎనిమిది మంది పోలీసులను పాశవికంగా కాల్చి చంపిన కేసులో ప్రధాన నిందితుడైన వికాస్‌ దూబే.. శుక్రవారం నాటి పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన విషయం తెలిసిందే. శుక్రవారం సాయంత్రం అతడి అంత్యక్రియలను కాన్పూర్‌లోని భైరవ్‌ ఘాట్‌ వద్ద ఉన్న విద్యుత్తు దహన వాటికలో భారీ బందోబస్తు మధ్య నిర్వహించారు. అంత్యక్రియల్లో దూబే భార్య రిచా, చిన్న కొడుకు, బావమరిది దినేశ్‌ తివారి మాత్రమే పాల్గొన్నారు. అంతిమ సంస్కారాలను దినేశ్‌ తివారి నిర్వహించారు. అటు దూబే తండ్రి రామ్‌కుమార్‌ అంత్యక్రియల్లో పాల్గొనలేదు.


దూబే తన కుటుంబానికి చెడ్డపేరు తెచ్చాడని, అతడికి తగిన శిక్ష పడిందని ఆయన వ్యాఖ్యానించారు. అంత్యక్రియల తర్వాత దూబే భార్య, కుమారుడు, వారి పనిమనిషిని స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి, సుమారు ఐదుగంటల పాటు ప్రశ్నించారు. మరో వైపు, మహారాష్ట్ర ఏటీఎస్‌ పోలీసులు దూబే అనుచరులు ఇద్దరిని థానేలో అరెస్టు చేశారు. కాగా, వికాస్‌ దూబే ఉదంతంపై ప్రత్యేక దర్యాప్తు విభాగం (సిట్‌) ఏర్పాటు చేస్తూ యోగి ఆదిత్యనాథ్‌ సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి భూస్‌రెడ్డి నేతృత్వంలో, అదనపు డీజీపీ ఏసీఎస్‌ హరిరామ్‌ శర్మ, డీఐజీ రవీంద్రన్‌ పర్యవేక్షణలో ఈ విభాగం పనిచేయనుంది. ఎనిమిది మంది పోలీసుల కాల్చివేత మొదలు.. అన్నికోణాలపై సిట్‌ దృష్టిసారిస్తుంది. మరోవైపు, వికాస్‌ దూబే ఉదంతంలో మనీ లాండరింగ్‌ కేసు నమోదుకు ఈడీ సన్నాహాలు చేస్తోంది. 


Updated Date - 2020-07-12T07:13:06+05:30 IST