నలుగురు పోలీసులకు 1.75 లక్షల జరిమానా!
ABN , First Publish Date - 2020-09-26T16:46:27+05:30 IST
కుటుంబ సమస్యల్లో మానవ హక్కులను ఉల్లంఘించిన ఇన్స్పెక్టర్ సహా నలుగురు పోలీసులకు రూ.1.75 లక్షల జరిమానా విధిస్తూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఉత్తర్వులు
చెన్నై (ఐసిఎఫ్) : కుటుంబ సమస్యల్లో మానవ హక్కులను ఉల్లంఘించిన ఇన్స్పెక్టర్ సహా నలుగురు పోలీసులకు రూ.1.75 లక్షల జరిమానా విధిస్తూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. కేకే నగర్కు చెందిన అబుల్హసన్ మానవ హక్కుల కమిషన్కు దాఖలు చేసిన పిటిషన్లో వివరాలు... కుటంబ సమస్యల కారణంగా 2013లో తనకు వ్యతిరేకంగా ఇచ్చిన ఫిర్యాదును అశోక్నగర్ మహిళా పోలీస్ ఇన్స్పెక్టర్ లక్ష్మి, ఎస్ఐ పసుపతి, కానిస్టేబుళ్లు మీరాబాయి, వరలక్ష్మి విచారించారని పేర్కొన్నారు. తన ప్రత్యర్థి వద్ద రూ.లక్ష తీసుకొని తనపై కేసు బనాయించారని, విచారణ పేరుతో 8 రోజులు కస్టడీలో ఉంచి తనను చిత్రహింసలు పెట్టిన పోలీసులపై చర్యలు చేపట్టాలని కోరారు. ఈ పిటీషన్ను విచారించిన మానవ హక్కల కమిషన్ సభ్యుడు చిత్తరంజన్ మోహన్దాస్.. సాక్ష్యాలు, ఇతర ఆధారాలతో మానవ హక్కులు ఉల్లంఘన జరిగిందని పేర్కొంటూ, ఇందుకు కారకులైన నలుగురు పోలీసులకు రూ.1.75 లక్షల జరిమానా విధించారు. ఈ మొత్తంలో ఇన్స్పెక్టర్ లక్ష్మి రూ.లక్ష, మిగిలిన ముగ్గురు తలా రూ.25 వేలు కట్టాలని, నలుగురిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.