దేశంలో మొదటి సీప్లేన్లో మోదీ విహారం
ABN , First Publish Date - 2020-10-31T22:36:52+05:30 IST
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మన దేశంలో మొట్ట మొదటి సీప్లేన్

అహ్మదాబాద్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మన దేశంలో మొట్ట మొదటి సీప్లేన్ సర్వీస్ను శనివారం ప్రారంభించారు. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన విగ్రహం ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ని వీక్షిస్తూ ఈ సీప్లేన్లో ప్రయాణించవచ్చు. గుజరాత్లోని అహ్మదాబాద్-కేవడియా మధ్య ఈ సీప్లేన్ సేవలు అందుబాటులో ఉంటాయి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ నుంచి సబర్మతి రివర్ఫ్రంట్ వరకు ఈ సీప్లేన్లో విహరించారు. సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ జయంత్యుత్సవాల సందర్భంగా ఈ సర్వీస్ను మోదీ ప్రారంభించారు. గుజరాత్ పర్యాటక రంగానికి ఈ సేవల వల్ల గొప్ప ఊతం లభిస్తుందని, ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు ఆకర్షితులవుతారని ఆశిస్తున్నారు. శుక్రవారం రాత్రి నుంచి ఈ సీప్లేన్లో విహరించేందుకు ఆన్లైన్ టిక్కెట్ల బుకింగ్ ప్రారంభమైంది. నవంబరు 1 నుంచి అధికారికంగా ఈ సేవలు ప్రారంభమవుతాయి. అహ్మదాబాద్, కేవడియాలలోని వాటర్డ్రోమ్ టిక్కెట్ కౌంటర్ల వద్ద కూడా ఒక్కో టిక్కెట్కు రూ.1,500 చెల్లించి కొనుక్కోవచ్చు.
ప్రపంచంలో తొలిసారి సీప్లేన్లో విహరించిన వ్యక్తి ఫ్రాన్స్కు చెందిన హెన్రీ ఫాబ్రే. ఆయన 1910 మార్చి 28న ఎటంగ్ డీ బెర్రేలో 600 మీటర్ల దూరం సీప్లేన్లో విహరించారు. బ్రిటిష్ కంపెనీ సూపర్మెరైన్ 1919 సెప్టెంబరులో ప్రపంచంలోనే మొదటిసారి ఫ్లయింగ్ బోట్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంగ్లండ్లోని వూల్స్టన్ నుంచి ఫ్రాన్స్లోని లే హావ్రే వరకు ఈ సీప్లేన్ సేవలను ప్రవేశపెట్టింది.