ఇళ్లలోనే ఉండి కరోనాను తరిమికొట్టండి: మోదీ
ABN , First Publish Date - 2020-04-24T17:19:31+05:30 IST
న్యూఢిల్లీ: గ్రామపంచాయతీ ప్రతినిధులతో ప్రధాని మోదీ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా అన్ని రాష్ట్రాల
![ఇళ్లలోనే ఉండి కరోనాను తరిమికొట్టండి: మోదీ](https://media.andhrajyothy.com/appimg/galleries/2020042411290753/04242020115042n27.jpg)
న్యూఢిల్లీ: గ్రామపంచాయతీ ప్రతినిధులతో ప్రధాని మోదీ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా అన్ని రాష్ట్రాల ప్రతినిధులతో మాట్లాడారు. కరోనా కట్టడికి ప్రజల్లో అవగాహన కల్పించడంపై చర్చించారు. ఈ-గ్రామ స్వరాజ్ పోర్టల్, మొబైల్ యాప్ను మోదీ ఆవిష్కరించారు. గ్రామాల అభివృద్ధికి స్థానిక ప్రజాప్రతినిధులు కృషి చేయాలని, విద్యుత్, రోడ్లు, పారిశుద్ధ్యంపై చర్యలు చేపట్టాలని సూచించారు. కరోనా సంక్షోభంలో పేదలకు సరిపడా ఆహారధాన్యాలు అందించాలన్నారు. కరోనా నివారణకు ఎనలేని కృషి చేస్తున్న సర్పంచ్లకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. గ్రామాల్లో సుపరిపాలన అందించేందుకు పంచాయతీరాజ్శాఖ ఎంతో కృషి చేస్తోందన్నారు. కరోనాపై ప్రజలకు మరింత అవగాహన, చైతన్యం కలిగించాలని సూచించారు.
కరోనా వైరస్ ఎన్నో పాఠాలు నేర్పిందని మోదీ చెప్పారు. కరోనా సంక్షోభ సమయంలో అందరూ ఆత్మనిర్భరంతో ఉండాలన్నారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండి కరోనాను తరిమికొట్టాలని మోదీ పిలుపునిచ్చారు. పంచాయతీ వ్యవస్థ బలపడితేనే ప్రజాస్వామ్యం బలపడుతుందన్నారు. ప్రస్తుతం లక్షా 25 వేల పంచాయతీల్లో బ్రాడ్బ్యాండ్ సేవలు అందిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. కరోనా వేళ గ్రామీణ ప్రాంతాల ప్రజలు పట్టణ వాసులకు పాఠాలు నేర్పారని మోదీ అన్నారు. కరోనా గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ రెండు గజాల సామాజిక దూరం పాటిస్తూ గ్రామీణులు ఆదర్శంగా నిలిచారని ప్రధాని కొనియాడారు.