సుసంపన్న దేశం కోసం అటల్జీ కృషి
ABN , First Publish Date - 2020-12-26T08:42:02+05:30 IST
అఖిల భారత హిందూ మహాసభ వ్యవస్థాపకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు మదన్ మోహన్ మాలవీయ, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి జయంతి సందర్భంగా ప్రధాని మోదీ...
- వాజపేయిపై పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రధాని
న్యూఢిల్లీ, డిసెంబరు 25: అఖిల భారత హిందూ మహాసభ వ్యవస్థాపకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు మదన్ మోహన్ మాలవీయ, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి జయంతి సందర్భంగా ప్రధాని మోదీ, స్పీకర్ ఓంబిర్లా శుక్రవారం నివాళులర్పించారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన ఓ కార్యక్రమంలో అక్కడ వారి చిత్రపటాల వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచారు. మాలవీయ బహుముఖ ప్రజ్ఞాశాలి అని, తన జీవితాన్నంతా సామాజిక సంస్కరణలు, దేశసేవకే అంకితం చేశారని మోదీ అన్నారు. సుధృడమైన, సుసంపన్నమైన భారత్ కోసం వాజపేయి చేసిన కృషిని జాతి ఎన్నడూ మరువదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ‘అటల్ బిహారీ వాజపేయి: ఎ కమామొరేటివ్ వాల్యూమ్’ అనే పుస్తకాన్ని మోదీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభలో విపక్షనేత గులాం నబీ ఆజాద్, లోక్సభలో విపక్షనేత అధీర్ రంజన్ చౌదరీ కూడా పాల్గొన్నారు. వాజపేయి స్మారకం ‘సదైవ్ అటల్’ వద్ద రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోదీ నివాళులర్పించారు. కాగా వాజపేయి గొప్ప దార్శనికుడని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అభివృద్ధి, సంక్షేమం రూపంలో మంచి పరిపాలనా శకాన్ని వాజపేయి ప్రారంభించారని హోంమంత్రి అమిత్ షా అన్నారు.