రాష్ట్రపతికి పవన్ గుప్తా క్షమాభిక్ష పిటిషన్
ABN , First Publish Date - 2020-03-02T21:25:11+05:30 IST
నిర్భయ కేసు దోషుల్లో ఒకడైన పవన్ కుమార్ గుప్తా దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారంనాడు తోసిపుచ్చింది. మార్చి 3వ తేదీ ఉదయం 6 గంటలకు అమలు ..
![రాష్ట్రపతికి పవన్ గుప్తా క్షమాభిక్ష పిటిషన్](https://media.andhrajyothy.com/appimg/galleries/2020030203534323/03022020155511n39.jpg)
న్యూఢిల్లీ: నిర్భయ కేసు దోషుల్లో ఒకడైన పవన్ కుమార్ గుప్తా దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారంనాడు తోసిపుచ్చింది. మార్చి 3వ తేదీ ఉదయం 6 గంటలకు అమలు చేయాల్సిన ఉరిశిక్ష అమలుపై స్టే విధించేది లేదని నలుగురు దోషులు పెట్టుకున్న పిటిషన్ను పాటియాలా కోర్టు సైతం తేల్చి చెప్పింది. దీంతో పవన్ కుమార్ గుప్తా రాష్ట్రపతికి మరోసారి క్షమాభిక్ష అభ్యర్థన చేసుకున్నారు. ఈ విషయాన్ని పవన్ గుప్తా తరఫు న్యాయవాది ఏపీ సింగ్ ధ్రువీకరించారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడగానే పవన్ గుప్తా తరఫున మెర్సీ పిటిషన్ వేసినట్టు చెప్పారు.
మార్చి 3న నిర్భయ దోషులను ఉరి తీయాలని ఢిల్లీ కోర్టు ఇప్పటికే డెత్ వారెంట్ జారీ చేసింది. రేపు ఉదయం 6 గంటలకే దోషులకు ఉరిశిక్ష అమలు కావాల్సి ఉంది. అయితే ఢిల్లీ కోర్టు, సుప్రీంకోర్టులో నిందితులు పిటిషన్లు వేశారు. తన ఉరిశిక్షను జీవితఖైదుగా మార్చాలని సుప్రీం కోర్టులో పవన్గుప్తా క్యూరేటివ్ పిటిషన్ వేయగా అత్యున్నత న్యాయస్థానం కొట్టిపారేసింది.