పాటలతో ఉల్లాసంగా, ఉత్సాహంగా కరోనా బాధితులు
ABN , First Publish Date - 2020-04-21T15:10:15+05:30 IST
జలంధర్ లోని ఒక ఆసుపత్రిలో పన్నెండు మంది కరోనావైరస్ రోగులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

చండీగఢ్: జలంధర్ లోని ఒక ఆసుపత్రిలో పన్నెండు మంది కరోనావైరస్ రోగులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వారు పంజాబీ పాటను వింటూ చప్పట్లు కొడుతూ తమలో ఉత్సాహాన్నినింపుకున్నారు. పంజాబ్ లోని జలంధర్ సివిల్ ఆస్పత్రిలో 11 మంది కరోనా సోకిన బాధితులకు సంబంధించిన వీడియోను ఒక రోగి చిత్రీకరించాడు.ఆ కరోనా బాధితులు తమ ఐసోలేషన్ వార్డులోని టెలివిజన్లో వస్తున్న పంజాబీ పాటకు చప్పట్లు కొడుతూ చేతులను గాలిలో ఊపారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోలో ఫేస్ మాస్క్ ధరించి, పడకలపై కూర్చున్న బాధితులు ఈ పాటను ఎంతగానో ఆస్వాదించారు. జలంధర్ సివిల్ ఆసుపత్రి సీనియర్ మెడికల్ ఆఫీసర్ కాశ్మీరీ లాల్ మాట్లాడుతూ కరోనావైరస్ రోగుల కోసం వార్డులో ఒక టెలివిజన్ సెట్ ఏర్పాటు చేశామని చెప్పారు. వారు పూర్తిగా కోలుకున్నాక ఇంటికి వెళతారని చెప్పారు. జలంధర్ జిల్లాలో 48 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి.