విద్యుత్తు చట్టం సవరణలను నిలిపేయండి : మోదీకి సీఎం పళనిస్వామి లేఖ

ABN , First Publish Date - 2020-05-09T23:45:28+05:30 IST

విద్యుత్తు చట్టానికి ప్రతిపాదించిన సవరణలను తాత్కాలికంగా నిలిపేయాలని

విద్యుత్తు చట్టం సవరణలను నిలిపేయండి : మోదీకి సీఎం పళనిస్వామి లేఖ

చెన్నై : విద్యుత్తు చట్టానికి ప్రతిపాదించిన సవరణలను తాత్కాలికంగా నిలిపేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి శనివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరారు. కేంద్ర విద్యుత్తు మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన సవరణలను రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించే వరకు నిలిపివేసే విధంగా ఆ మంత్రిత్వ శాఖకు తెలియజేయాలని కోరారు.


పళనిస్వామి శనివారం మోదీకి రాసిన లేఖలో కేంద్ర ప్రభుత్వ విధానం వల్ల రైతులకు ఉచిత విద్యుత్తును అందజేయడానికి ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొన్నారు. ముసాయిదా సవరణ బిల్లులోని నిబంధనలను పరిశీలించినపుడు సాధారణ ప్రజలు కూడా ఈ సవరణలతో ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలుస్తోందన్నారు. ముఖ్యంగా కోవిడ్-19 మహమ్మారి సంక్షోభ సమయంలో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. విద్యుత్తు చట్టానికి ఇంతటి స్థాయిలో భారీగా సవరణలను తేవడానికి ఇది సరైన సమయం కాదని అభిప్రాయపడ్డారు.


ప్రతిపాదిత సవరణలపై రాష్ట్ర ప్రభుత్వాలతోనూ, ఇతరులతోనూ చర్చించాలని కోరారు. తమిళనాడులో విద్యుత్తు రంగం స్వతంత్రంగా పని చేయడంపై ఈ సవరణలు ప్రత్యక్ష ప్రభావం చూపుతాయన్నారు. 


వినియోగదారులకు విద్యుత్తు సరఫరాను ప్రైవేటీకరించి, ఫ్రాంచైజీల ద్వారా సరఫరా చేయాలని ప్రతిపాదించారని, అంతేకాకుండా యావత్తు పంపిణీ నెట్‌వర్క్‌ను ప్రైవేటీకరించాలని ప్రతిపాదించారని, ఈ ప్రతిపాదనలు రాష్ట్ర యుటిలిటీస్‌కు నష్టం కలిగిస్తాయని, ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని తెలిపారు. 


వ్యవసాయ, గృహ వినియోగదారులకు ఇస్తున్న రాయితీలను నేరుగా వినియోగదారులకే ప్రత్యక్ష లబ్ధి బదిలీ ద్వారా అందజేయాలన్న ప్రతిపాదనపై కూడా పళనిస్వామి అభ్యంతరం వ్యక్తం చేశారు.


రైతులకు ఉచిత విద్యుత్తు అందజేయడానికి తమిళనాడు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అయితే రాయితీని ఏవిధంగా వారికి అందజేయాలనే అంశంపై నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికే వదిలిపెట్టాలని కోరారు. 


Updated Date - 2020-05-09T23:45:28+05:30 IST