కుల్భూషణ్ జాదవ్ కేసులో భారత్కు మరో అవకాశం : పాకిస్థాన్ హైకోర్టు
ABN , First Publish Date - 2020-09-03T23:48:59+05:30 IST
భారత నావికా దళం మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్ కేసులో పాకిస్థాన్ ఫెడరల్ ప్రభుత్వానికి ఇస్లామాబాద్ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.

ఇస్లామాబాద్ : భారత నావికా దళం మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్ కేసులో పాకిస్థాన్ ఫెడరల్ ప్రభుత్వానికి ఇస్లామాబాద్ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. మరణ శిక్ష విధించడంతో జైలులో ఉన్న జాదవ్ తరపున వాదనలు వినిపించేందుకు ఓ న్యాయవాదిని నియమించేందుకు భారత దేశానికి మరొక అవకాశం ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఓ నెల తర్వాత జరుగుతుందని తెలిపింది.
జాదవ్ను పాకిస్థాన్ దళాలు అక్రమంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయనకు పాకిస్థానీ మిలిటరీ కోర్టు మరణ శిక్ష విధించింది. ఈ శిక్షను పునఃసమీక్షించాలని అంతర్జాతీయ న్యాయస్థానం పాకిస్థాన్ను ఆదేశించింది. అయితే పాకిస్థాన్ ఆయనకు కాన్సులర్ యాక్సెస్ కల్పించేందుకు ఇబ్బందులు సృష్టిస్తోంది. ఆయనతో ఎటువంటి అడ్డంకులు లేకుండా మాట్లాడేందుకు భారత దేశ దౌత్యాధికారులకు అవకాశం ఇవ్వడం లేదు.
మరణ శిక్షపై ఇస్లామాబాద్ హైకోర్టు రివ్యూ జరుపుతోంది. అటార్నీ జనరల్ ఖలీద్ జావేద్ ఖాన్ వాదనలు వినిపిస్తూ, అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను పాటించేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం భారత దేశానికి కాన్సులర్ యాక్సెస్ కల్పించిందని, అయితే జాదవ్ తరపున వాదించేందుకు న్యాయవాదిని ఏర్పాటు చేయాలని పాకిస్థాన్ కోరినప్పటికీ భారత ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదని చెప్పారు.
దీనిపై హైకోర్టు స్పందిస్తూ, జాదవ్ తరపున న్యాయవాదిని నియమించేందుకు జారీ చేసిన ఆదేశాలను భారత ప్రభుత్వానికి పంపించాలని తెలిపింది. తదుపరి విచారణ అక్టోబరు 3న జరుగుతుందని పేర్కొంది.