మోదీపై ఆఫ్రిదీ తీవ్ర వ్యాఖ్యలు.. గట్టిగా జవాబిచ్చిన గౌతం గంభీర్

ABN , First Publish Date - 2020-05-17T20:22:39+05:30 IST

ముజఫరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మోదీపై ఆఫ్రిదీ తీవ్ర వ్యాఖ్యలు.. గట్టిగా జవాబిచ్చిన గౌతం గంభీర్

ముజఫరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కరోనా కన్నా పెద్ద జబ్బు మోదీ హృదయంలో, మనసులో ఉందన్నారు. మత విద్వేషంతో మోదీ మత రాజకీయాలు చేస్తున్నారని ఆఫ్రిదీ ఆరోపణలు చేశారు. కరోనా వేళ ఆఫ్రిదీ ఫౌండేషన్ ద్వారా సేకరించిన విరాళాలతో  పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో నిత్యావసరాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆఫ్రిదీ మాట్లాడుతూ కశ్మీరీలపై మోదీ అరాచకాలు చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై మోదీ జవాబివ్వాలని ఆఫ్రిదీ డిమాండ్ చేశారు. ఆఫ్రిదీ డైలాగ్‌లకు పాక్ సైనికులు చప్పట్లు కొట్టారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. 




మరోవైపు ఆఫ్రిదీ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ మండిపడ్డారు. ఆఫ్రిదీ, ఇమ్రాన్, బాజ్వా లాంటి జోకర్లు భారత్‌కు, మోదీకి వ్యతిరేకంగా విషం చిమ్ముతున్నారని గంభీర్ వ్యాఖ్యానించారు. ఏడు లక్షల సైన్యం, 20 కోట్ల జనాభా ఉన్న పాకిస్థాన్ 70 ఏళ్లుగా కశ్మీర్‌ కోసం బిచ్చమెత్తుకుంటోందన్నారు. జడ్జిమెంట్ డే వరకూ కశ్మీర్ దక్కబోదని హితవు పలుకుతూ బంగ్లాదేశ్ గుర్తుంది కదా అని గంభీర్ ప్రశ్నించారు. 1971లో జరిగిన యుద్ధంలో ఇండియన్ ఆర్మీ తూర్పు పాకిస్థాన్‌‌‌పై విజయం సాధించి బంగ్లాదేశ్‌‌ను ఏర్పాటు చేసింది. నాటి యుద్ధంలో లక్షమంది పాక్ సైనికులకు భారత్ క్షమాభిక్ష ప్రసాదించింది. లొంగిపోయిన లక్షమంది పాక్ సైనికులను క్షమించి వదిలిపెట్టింది. బంగ్లాదేశ్ ఏర్పాటును పాక్ అత్యంత అవమానకర పరాజయంగా భావిస్తూ ఉంటుంది. సరిగ్గా దీన్నే గంభీర్ తన ట్వీట్ ద్వారా ఆఫ్రిదీకి గుర్తు చేశారు. 





Updated Date - 2020-05-17T20:22:39+05:30 IST