కరోనాతో 8.6 కోట్ల చిన్నారుల ఆకలికేక!
ABN , First Publish Date - 2020-05-29T06:45:45+05:30 IST
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. పనుల్లేక సామాన్యులు పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంది. కరోనా కారణంగా ఈ ఏడాది చివరినాటికి...

ఐక్యరాజ్య సమితి, మే 28: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. పనుల్లేక సామాన్యులు పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంది. కరోనా కారణంగా ఈ ఏడాది చివరినాటికి అల్ప, మధ్యాదాయ దేశాల్లో మరో 8.6 కోట్ల మంది చిన్నారులు పేదరికంలోకి కూరుకుపోతారని తాజా నివేదిక వెల్లడిస్తోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య 67 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని ఆ నివేదిక పేర్కొంది.
కరోనా విలయాన్ని అంచనా వేసేందుకు అమెరికాలోని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ, ఐక్యరాజ్య సమితి సంయుక్తంగా ఒక అధ్యయనం నిర్వహించాయి. కాగా.. కరోనా వైరస్ సృష్టించిన ఆర్థిక నష్టం వలన లాటిన్ అమెరికాలో 1.4 కోట్ల మంది ఆకలితో అలమటిస్తారని ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ ఆహార కార్యక్రమం హెచ్చరించింది. కాగా, ప్రపంచవ్యాప్తంగా 13 దేశాల్లోని వైద్య సిబ్బందిపై కొవిడ్-19కు సంబంధించి మార్చి నుంచి ఇప్పటివరకు 208 దాడులు జరిగాయని రెడ్క్రాస్ అంతర్జాతీయ కమిటీ అధ్యక్షుడు పీటర్ మౌరర్ తెలిపారు. వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారన్న ఆరోపణలతో దాడులు చేయడం సరికాదన్నారు.