‘ఆయుష్మాన్ భారత్ పథకం క్రింద ఆసుపత్రిలో చేరికలపై అష్ట దిగ్బంధనం ప్రభావం’

ABN , First Publish Date - 2020-06-22T00:08:30+05:30 IST

కోవిడ్-19 మహమ్మారి నిరోధం కోసం అమలు చేస్తున్న దేశవ్యాప్త అష్ట దిగ్బంధనం

‘ఆయుష్మాన్ భారత్ పథకం క్రింద ఆసుపత్రిలో చేరికలపై అష్ట దిగ్బంధనం ప్రభావం’

న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి నిరోధం కోసం అమలు చేస్తున్న దేశవ్యాప్త అష్ట దిగ్బంధనం ప్రభావం ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన పథకంపై పెద్ద ఎత్తున పడింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఈ ఆరోగ్య బీమా పథకం క్రింద ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య బాగా తగ్గింది. వారానికి సగటున 51 శాతం తగ్గింది. 


నేషనల్ హెల్త్ అథారిటీ విడుదల చేసిన నివేదికలో తెలిపిన వివరాల ప్రకారం, ఈ పథకం క్రింద నిరుపేదలైన కేన్సర్ రోగులకు రూ.5 లక్షల వరకు లబ్ధి చేకూరుతుంది. అయితే అష్ట దిగ్బంధనం సమయంలో  ఆసుపత్రుల్లో చేరే కేన్సర్ రోగుల సంఖ్య సుమారు 64 శాతం తగ్గిపోయింది. సాధారణ ప్రసవాలు, సిజేరియన్ సెక్షన్స్ కోసం ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య 26 శాతం తగ్గింది. ‘‘పీఎం-జేఏవై అండర్ లాక్‌డౌన్ : ఎవిడెన్స్ ఆన్ యుటిలైజేషన్ ట్రెండ్స్ పీఎం-జేఏవై’’ పేరుతో ఈ నివేదికను విడుదల చేశారు. 


పురుషుల కన్నా ఎక్కువగా మహిళలు, బాలలు, వృద్ధులు ప్రభావితులైనట్లు ఈ నివేదిక తెలిపింది. ఈ పథకం క్రింద లబ్ధి పొందేందుకు దరఖాస్తు చేసుకునేవారి సంఖ్య అస్సాం, మహారాష్ట్ర, బిహార్ రాష్ట్రాల్లో 75 శాతానికి పైగా తగ్గిపోయిందని పేర్కొంది. అదేవిధంగా ఉత్తరాఖండ్, పంజాబ్, కేరళ రాష్ట్రాల్లో ఈ తగ్గుదల 25 శాతం వరకు ఉందని వివరించింది. 


నేషనల్ హెల్త్ అథారిటీ సీఈఓ ఇందు భూషణ్ మాట్లాడుతూ, మోకాలి చిప్పల మార్పిడి చికిత్సలు, కంటి శుక్లాల శస్త్ర చికిత్సలు వంటివాటిలో జరిగిన నష్టాన్ని భర్తీ చేసే అవకాశం ఉందన్నారు. కేన్సర్ సర్జరీలు, హైఫీవర్ చికిత్సలు వంటివాటిలో జరిగిన నష్టాన్ని భర్తీ చేయడం కష్టమన్నారు. ఈ పథకం క్రింద రోగులు ఆసుపత్రుల్లో చేరుతుండటం జూన్ నెలలో పెరిగిందని, అయితే సాధారణ స్థితికి రావడానికి ఒకట్రెండు నెలలు పట్టవచ్చునని చెప్పారు. 


Updated Date - 2020-06-22T00:08:30+05:30 IST