'ట్వీట్ ఫ్రెండ్లీ' రాహుల్ స్పందించరేం?: నిర్మలా సీతారామన్
ABN , First Publish Date - 2020-10-24T23:26:58+05:30 IST
పంజాబ్లోని హోషియార్పూర్ ఘటనపై బీజేపీ విమర్శలు గుప్పించిది. ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటనపై...

న్యూఢిల్లీ: పంజాబ్లోని హోషియార్పూర్ ఘటనపై బీజేపీ విమర్శలు గుప్పించిది. ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటనపై కాంగ్రెస్ మౌనముద్ర దాల్చడాన్ని కాంగ్రెస్ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ నిలదీశారు. 'ట్వీట్ ఫ్రెండ్రీ' రాహుల్ గాంధీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. రాజకీయంగా తమకు ఉపకరించే ప్రతి ప్రాంతంలోనూ పర్యటించే సోదరుడు, సోదరిని (రాహుల్, ప్రియాంక) హోషియాపూర్ ఘటన కదిలించలేదా అని నిలదీశారు.
శనివారంనాడిక్కడ మీడియాతో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, బీహార్కు చెందిన ఆరేళ్ల దళిత వలస బాలిక హోషియార్పూర్లో అత్యాచారం, హత్యకు గురైందని, సగం దేహం కాలిపోయిందని అన్నారు. ఏ ఘటన జరిగినా దానిని రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకునేందుకు హుటాహుటిన వెళ్లే అన్నాచెల్లెళ్ల అంతర్మాత్మను హోషియార్పూర్ ఘటన కదిలించలేదా అని ఆమె ప్రశ్నించారు. అన్నాచెల్లెళ్లు ఇద్దరూ ఎక్కడున్నారు?. ట్వీట్ ఫ్రెండ్లీ రాహుల్ ఇంతవరకూ ఈ ఘటనపై ఎందుకు ఒక్కముక్క కూడా మాట్లాడలేదు? ఒక మహిళ ఆ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. ఎంపిక చేసిన ఘటనలను మాత్రమే ఉపద్రవంగా చూపించడం ఆ పార్టీ స్టేచర్ అనుకోవచ్చా? అని ఆమె నిలదీశారు. కాంగ్రెస్ సమాధానం చెప్పితీరాలని అన్నారు. బాధిత కుటుంబానికి అండగా నిలబడేందుకు, న్యాయం జరిగేలా చూసేందుకు బీజేపీ వెన్నుదన్నుగా నిలుస్తుందని నిర్మలా సీతారామన్ భరోసా ఇచ్చారు.
ఆరేళ్ల బాలికపై అత్యాచారం జరిపి, హత్య చేసిన ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ శుక్రవారంనాడు తక్షణ విచారణకు ఆదేశించారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని ప్రకటించారు. ఈ ఘటనలో అనుమానితులను ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు.