రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కార విజేతలు వీరే
ABN , First Publish Date - 2020-10-07T21:41:54+05:30 IST
జీనోమ్ ఎడిటింగ్ విధానాన్ని అభివృద్ధిపరచిన శాస్త్రవేత్తలను నోబెల్ పురస్కారం వరించింది. రసాయన శాస్త్రంలో విశేష కృషి చేసిన ఎమ్మాన్యుయెల్లె

స్టాక్హోం : జీనోమ్ ఎడిటింగ్ విధానాన్ని అభివృద్ధిపరచిన శాస్త్రవేత్తలను నోబెల్ పురస్కారం వరించింది. రసాయన శాస్త్రంలో విశేష కృషి చేసిన ఎమ్మాన్యుయెల్లె చార్పెంటీర్, జెనిఫర్ ఏ డౌడ్నా ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు.
రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ బుధవారం రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారం, 2020ని ప్రకటించింది. జీనోమ్ ఎడిటింగ్లో వీరు చేసిన కృషికి గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది.
అకాడమీ విడుదల చేసిన ప్రకటనలో, జీన్ టెక్నాలజీకి సంబంధించిన అత్యంత పదునైన సాధనాన్ని ఎమ్మాన్యుయెల్లె చార్పెంటీర్, జెనిఫర్ ఏ డౌడ్నా కనుగొన్నట్లు తెలిపింది. సీఆర్ఐఎస్పీఆర్/సీఏఎస్9 జెనెటిక్ సిజర్స్ను వీరు అభివృద్ధిపరచినట్లు తెలిపింది. దీనిని ఉపయోగించి పరిశోధకులు డీఎన్ఏను మార్చవచ్చునని తెలిపింది. జంతువులు, మొక్కలు, సూక్ష్మ జీవుల డీఎన్ఏను ఈ విధానాన్ని ఉపయోగించి మార్చవచ్చునని వివరించింది. లైఫ్ సైన్సెస్పై ఈ టెక్నాలజీ ప్రభావం విప్లవాత్మకంగా ఉంటుందని తెలిపింది. కొత్త కేన్సర్ థెరపీలకు ఉపయోగపడుతుందని పేర్కొంది. వారసత్వ వ్యాధులను నయం చేయడంలో కూడా దోహదపడుతుందని పేర్కొంది.
స్వీడిష్ ఇన్వెంటర్ ఆల్ఫ్రెడ్ నోబెల్ ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం క్రింద విజేతలకు బంగారు పతకం, దాదాపు 1.1 మిలియన్ డాలర్లు బహుమతిగా ఇస్తారు.