కోవిడ్ టెస్ట్ చేయించుకుని, వీడియో అప్లోడ్ చేస్తానంటున్న పంజాబ్ సీఎం
ABN , First Publish Date - 2020-08-14T21:41:19+05:30 IST
కోవిడ్-19 పరీక్షలు చేయించుకోవడం తప్పేమీ కాదని, ఈ వారమంతా పంజాబ్లో
చండీగఢ్ : కోవిడ్-19 పరీక్షలు చేయించుకోవడం తప్పేమీ కాదని, ఈ వారమంతా పంజాబ్లో ‘పరీక్షల వారం’ నిర్వహిస్తామని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ చెప్పారు. తాను ఈ పరీక్ష చేయించుకుని, వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తానని తెలిపారు.
డిప్యూటీ కమిషనర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్ఎస్పీలు, సివిల్ సర్జన్లతో జరిగిన సమావేశంలో కోవిడ్-19 మహమ్మారిపై ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సమీక్ష నిర్వహించారు. దుకాణాల్లో పని చేసేవారు, బజారులలో వివిధ పదార్థాలను అమ్మేవారు, ముందు వరుసలో ఉంటూ పని చేస్తున్న ప్రభుత్వోద్యోగులు ఈ వారంలో కోవిడ్-19 పరీక్షలు చేయించుకోవాలని పిలుపునిచ్చారు. కోవిడ్-19 అంటే ఏర్పడిన దురభిప్రాయం వల్ల పరీక్షలు చేయించుకోవడానికి చాలా మంది ముందుకు రావడం లేదన్నారు. ఈ దురభిప్రాయాన్ని పోగొట్టేందుకు తాను స్వయంగా పరీక్ష చేయించుకుని, దానికి సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తానని చెప్పారు. కోవిడ్-19 పాజిటివ్ కేసు నిర్థరణ అయినపుడు, ఆ వ్యక్తితో కలిసిమెలిసి తిరిగిన దాదాపు 10 మందిని గుర్తించి పరీక్షలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చెప్పారు.