ఏ పత్రాలూ ఇవ్వక్కర్లేదు
ABN , First Publish Date - 2020-03-13T08:46:25+05:30 IST
జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్) కోసం ఎటువంటి డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా...

ఎన్పీఆర్పై రాజ్యసభలో అమిత్ షా
న్యూఢిల్లీ, మార్చి 12: జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్) కోసం ఎటువంటి డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఎవర్నీ అనుమానితులు(డౌట్ఫుల్ -‘డి’)గా ప్రకటించబోమని స్పష్టం చేశారు. ఢిల్లీ అల్లర్లపై గురువారం రాజ్యసభలో స్వల్పకాలిక చర్చకు ఆయన సమాధానం ఇచ్చారు. ‘‘ఎన్పీఆర్ కోసం ఏ పత్రాలూ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రజలు వారి దగ్గర ఏ సమాచారం ఉంటే అది ఇస్తేచాలు. మిగతా ప్రశ్నలను ఖాళీగా వదిలేయొచ్చు’’ అని వివరించారు.
‘డి’ని తొలగిస్తారా అన్న కాంగ్రెస్ సభ్యులు ప్రశ్నించగా అమిత్ షా బదులిచ్చారు. ‘‘ఎన్పీఆర్ గురించి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ఎన్పీఆర్ను తాజాపరిచే ప్రక్రియలో ఎవర్నీ అనుమానితులుగా మార్కు చేయబోము’’ అని తెలిపారు. ఎన్పీఆర్ ప్రక్రియను చేపట్టేది లేదని ఇప్పటికే పలు రాష్ట్రాలు ప్రకటించిన తెలిసిందే. ఎన్పీఆర్లో ప్రశ్నలకు ప్రజలు సమాధానాలు ఇవ్వకపోతే ఆ ఇళ్లకు ‘డి’ ముద్ర వేస్తారన్న భయాలూ ఉన్నాయి. ఢిల్లీలో హింస, అల్లర్ల బా ధ్యులను కులం, మతం, రాజకీయ పార్టీలతో సంబంఽధం లేకుండా శిక్షిస్తామన్నారు. విధ్వంసానికి పాల్పడిన 1,922 మందిని ఫేషియల్ ఐడెంటిఫికేషన్ సాఫ్ట్వేర్ ద్వారా గుర్తించామన్నారు. వారి నుంచి నష్ట పరిహారం రాబడతామన్నారు.