రైతు పోరాటాన్ని ఆపే శక్తి ప్రపంచంలోని ఏ ప్రభుత్వానికీ లేదు: రాహుల్

ABN , First Publish Date - 2020-11-28T02:44:07+05:30 IST

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు దేశవ్యాప్త ఆందోళన చేపట్టిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి...

రైతు పోరాటాన్ని ఆపే శక్తి ప్రపంచంలోని ఏ ప్రభుత్వానికీ లేదు: రాహుల్

న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు దేశవ్యాప్త ఆందోళన చేపట్టిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రైతులు చేస్తున్న పోరాటాన్ని ‘‘నిజమైన పోరాటం’’గా అభివర్ణించిన ఆయన.. ప్రపంచంలోని ఏ ప్రభుత్వమూ దీన్ని ఆపజాలదని పేర్కొన్నారు. ‘‘ఛలో ఢిల్లీ’’ మార్చ్‌లో భాగంగా వేలాది మంది రైతులు ఇవాళ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ దేశరాజధాని ఢిల్లీలో ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పలు మార్గాల్లో వారిని అడ్డుకున్న పోలీసులు లాఠీ చార్జిలతో పాటు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ మాజీ చీఫ్ కేంద్ర ప్రభుత్వంపై ట్విటర్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నిజమైన పోరాటం చేస్తున్న రైతులను ప్రపంచంలోని ఏ ప్రభుత్వమూ అడ్డుకోజాలదు. రైతుల డిమాండ్లను మోదీ ప్రభుత్వం ఆమోదించి, ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందే. ఇది ఆరంభం మాత్రమే...’’ అని రాహుల్ ట్వీట్ చేశారు. తన ట్వీట్‌కు ‘‘ఐయామ్‌ విత్ ఫార్మర్స్’’ అన్న ట్యాగ్‌ను జోడించారు. కాగా ఇవాళ సాయంత్రం ఎట్టకేలకు ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేపట్టేందుకు రైతులను అనుమతిస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు. దాదాపు 30 సంఘాలకు చెందిన పంజాబ్ రైతులు నూతన చట్టాలకు వ్యతిరేకంగా... లర్లూ, శంభూ, పటియాలా-పెహోవా, పట్రాన్-కనౌరీ, మూనాక్-తోహానా, రాటియా-పాతేబాద్, తల్వాండి-సిర్సా సహా పలు మార్గాల్లో ఢిల్లీ వరకు మార్చ్ నిర్వహిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంతో పాటు కనీస మద్దతు ధరకు హామీ ఇవ్వాలంటూ రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - 2020-11-28T02:44:07+05:30 IST