బీజేపీకి ఎక్కువ స్థానాలు లభించినా, నితీశ్ కుమారే మా నేత : జేపీ నడ్డా

ABN , First Publish Date - 2020-11-01T01:12:26+05:30 IST

బిహార్‌లో ఎన్డీయే కూటమికి నేత నితీశ్ కుమారేనని బీజేపీ జాతీయ అధ్యక్షుడు

బీజేపీకి ఎక్కువ స్థానాలు లభించినా, నితీశ్ కుమారే మా నేత : జేపీ నడ్డా

పాట్నా : బిహార్‌లో ఎన్డీయే కూటమికి నేత నితీశ్ కుమారేనని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మరోసారి స్పష్టం చేశారు. శాసన సభ ఎన్నికల్లో తమ పార్టీకి ఎక్కువ స్థానాలు లభించినప్పటికీ జేడీయూ చీఫ్, ముఖ్యమంత్రి నితీశ్ కుమారే తమ కూటమికి నాయకుడిగా కొనసాగుతారని చెప్పారు. హాజీపూర్‌లో శనివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో నడ్డా మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో తమ కూటమికి మూడింట రెండొంతుల ఆధిక్యత లభిస్తుందని, ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. 


ఈ ఎన్నికల్లో తమకు లభించే స్థానాల సంఖ్య తగ్గే ప్రసక్తే లేదని, బీజేపీ, జేడీయూ, హెచ్ఏఎం, వీఐపీ కలిసికట్టుగా మూడింట రెండొంతుల ఆధిక్యత సాధిస్తాయని చెప్పారు. లాలూ ప్రసాద్ యాదవ్ తప్పుడు పరిపాలన, నితీశ్ కుమార్ అందించిన సుపరిపాలన ప్రజలకు గుర్తుందన్నారు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారన్నారు. 


నితీశ్ కుమార్ 15 ఏళ్ళపాటు ముఖ్యమంత్రిగా పరిపాలించడం వల్ల కొందరు నిరాసక్తంగా కనిపించవచ్చునని, అయితే ప్రజలు ఆయన అనుభవాన్ని, మచ్చలేని, నిష్కళంక చరిత్రను గుర్తు చేసుకుని, ఆయన నాయకత్వాన్నే కోరుకుంటారని అన్నారు. ప్రతిపక్షాల కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్‌ కన్నా నితీశ్ కుమార్ ట్రాక్ రికార్డ్ నిష్కళంకమైనదని చెప్పారు. ఆర్జేడీ అంటే ఆటవిక పాలన అని అందరికీ తెలుసునన్నారు. తాజాగా విధ్వంసకర సీపీఐ-ఎంఎల్, కాంగ్రెస్‌లతో ఆర్జేడీ చేరిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇటీవల పాకిస్థాన్ అధికార ప్రతినిథిగా మారిందన్నారు. ఈ పార్టీలకు ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు.


మరోవైపు మహా కూటమి నేత తేజస్వి యాదవ్ ఘాటైన విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన విశ్వసనీయతను కోల్పోయారని, బీజేపీ-జేడీయూ కూటమి ఈ ఎన్నికల్లో పరాజయం పాలవుతుందని జోస్యం చెప్తున్నారు.


బిహార్ శాసన సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ బుధవారం జరిగింది. 16 జిల్లాల్లోని 71 నియోజకవర్గాల ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. రెండో దశ పోలింగ్ నవంబరు 3న, మూడో దశ పోలింగ్ నవంబరు 7న జరుగుతుంది. ఓట్ల లెక్కింపు నవంబరు 10న జరుగుతుంది. 


Updated Date - 2020-11-01T01:12:26+05:30 IST