కీలక నిర్ణయాలు ప్రకటించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

ABN , First Publish Date - 2020-03-24T20:37:39+05:30 IST

సామాన ప్రజానీకానికి, కార్పొరేట్లకు ఉపకరించే కీలక ఆర్థిక ఉపశమన చర్యలను కేంద్రం ప్రకటించింది. ప్రధాన స్కీమ్‌ల గడువు తేదీని పొడిగిస్తున్నట్టు ..

కీలక నిర్ణయాలు ప్రకటించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ: సామాన ప్రజానీకానికి, కార్పొరేట్లకు ఉపకరించే కీలక ఆర్థిక ఉపశమన చర్యలను కేంద్రం ప్రకటించింది. ప్రధాన స్కీమ్‌ల గడువు తేదీని పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారంనాడిక్కడ మీడియా సమావేశంలో ప్రభుత్వ నిర్ణయాలను ప్రకటించారు.

2018-2019 ఆర్థిక సంవత్సరం ఆదాయం పన్ను రిటర్న్‌ల దాఖలు గడువును జూన్ 30వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. పేమెంట్ల చెల్లింపు వడ్డీ రేటును 12 నుంచి 9 శాతానికి తగ్గిస్తున్నామని తెలిపారు. ఆధార్-పాన్ కార్డు అనుసంధానం తేదీని కూడా జూన్ 30 వరకూ పొడిగించినట్టు మంత్రి చెప్పారు. 10 శాతం అదనపు చెల్లింపు ఉండదు. మార్చి, ఏప్రిల్, మే 2020 జీఎస్‌టీ (వస్తుసేవల పన్ను) రిటర్న్‌లు, కంపోజిషన్ రిటర్న్‌ల‌ దాఖలు గడువును కూడా జూన్ 30 వరకూ పొడిగించారు. ఎగుమతులు, దిగుమతులకు ఊరట కలిగిస్తూ, కస్టమ్స్ క్లియరెన్స్‌ను జూన్ 30 వరకూ నిత్యావసర సర్వీసుగా పరిగణిస్తామని ప్రకటించారు.

బోర్డు మీటింగుల నిర్వహణ తప్పనిసరి అనే నిబంధనను 60 రోజుల పాటు సడలించింది. ఏటీఎంలో నగదు విత్‌డ్రాలు మూడు నెలల పాటు ఎలాంటి చార్జీలు ఉండవు. కరోనా వైరస్ వ్యాప్తితో దేశంలో తలెత్తిన పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని కేంద్రం ఈ కీలక ఆర్థిక ఉపశమన చర్యలను ప్రకటించింది.

Updated Date - 2020-03-24T20:37:39+05:30 IST