కీలక నేతలతో రజనీ మంతనాలు.. ఇంటికి పోలీసు భద్రత
ABN , First Publish Date - 2020-12-10T17:55:10+05:30 IST
రాజకీయ ప్రవేశంపై అభిప్రాయాలను తెలుసుకున్నారు.

చెన్నై : అసెంబ్లీ ఎన్నికల వ్యూహరచనలు, పార్టీ ఆవిర్భావ సభ ఏర్పాట్లపై సూపర్స్టార్ రజనీకాంత్ బుధవారం మక్కల్ మండ్రం నేతలతో సమావేశమయ్యారు. కోడంబాక్కంలోని రాఘ వేంద్ర కల్యాణమండపంలో ఆకస్మికంగా సమావేశం ఏర్పాటైంది. రజనీకి ప్రత్యేక సలహదారులు అర్జున్మూర్తి, తమిళురివి మణియన్ సమావేశంలో పాల్గొన్నారు. నవంబర్ 30న రజనీకాంత్ రాష్ట్రవ్యాప్తంగా రజనీ మక్కల్ మండ్రం జిల్లా శాఖ నేతలు, నియోజకవర్గాల ఇన్చార్జీలతో సమావేశమయ్యారు. రాజకీయ ప్రవేశంపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. తన అభిమానులను సంతోషపెట్టేలా త్వరలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని రజనీ ఈ సందర్భంగా ప్రకటించారు. ఆ తర్వాత ఈ నెల 3న రజనీకాంత్ హఠాత్తుగా తన ట్విట్టర్ పేజీలో రాజకీయ ప్రవేశం చేస్తున్నట్లు ప్రకటించారు.
ఆ తర్వాత పోయెస్గార్డెన్ నివాసగృహం వద్ద మీడియాతో మాట్లాడు తూ... వచ్చే యేడాది జనవరిలో పార్టీ పెడతానని, ఆ వివరాలను డిసెంబర్ 31న ప్రకటిస్తానని పేర్కొన్నారు. తరువాత రజనీ బెంగళూరు వెళ్లి తన సోదరుడు సత్యనారాయణ ఆశీస్సులు తీసుకుని రెండు రోజుల క్రితం చెన్నై తిరిగి వచ్చారు. అదే సమయంలో మణియన్ రజనీని కలుసుకుని భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ... రజనీ ప్రతిపాదిస్తున్న ఆధ్యాత్మిక రాజకీయాలు ఏ మతానికి వ్యతిరేకం కాదని, అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు చేపడుతున్నామన్నారు. ఈ పరిస్థి తుల్లో హఠాత్తుగా మంగళవారం రాత్రి మక్కల్ మండ్రం నేతలందరికీ రజనీ ఫోన్ చేసి బుధవారం రాఘవేంద్ర కల్యాణమండపంలో జరిగే సమావేశానికి హాజరు కావాలని కోరారు. దీంతో బుధవారం ఉదయం మక్కల్ మండ్రం నేతలంతా చెన్నైకి ఆగమేఘాలపై తరలివచ్చారు. రాఘవేంద్ర కల్యాణ మండపంలో గతంలోలా ఎలాంటి పోలీసుభద్రతా ఏర్పాట్లు లేకుండా మీడియాను దూరంగా ఉంచి రజనీ కాంత్ మండ్రం నేతలతో సమావేశమై చర్చించారు.
డిసెంబర్ 31న పార్టీ ప్రారంభ ప్రకటన చేయాల్సి ఉందని, మదురై లేదా తిరుచ్చి నగరంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అభిమానుల సమక్షంలో ప్రకటిస్తే బాగుంటుందా అని అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 14 నుంచి తాను ‘అన్నాత్తే’ షూటింగ్కు హైదరాబాద్ వెళ్లి నెలాఖరుకు చెన్నై తిరిగి వస్తానని రజనీ చెప్పారు. ఆ పరిస్థితుల్లో పార్టీ ప్రకటన సభకు భారీ ఏర్పాట్లు చేపట్టేందుకు మక్కల్ మండ్రం నేతలు రంగంలోకి దిగాలని రజనీ కోరారు. ఇక పార్టీకి ఏ పేరు పెట్టాలి? ఏ గుర్తును ఎంపిక చేసుకోవాలి? అనే విషయాలపై కూడా ఈ సమావేశంలో చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.
రజనీ ఇంటికి పోలీసు భద్రత...
ఇదిలా ఉండగా రాజకీయ పార్టీ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న రజనీకాంత్ నివాసం వద్ద బుధవారం పోలీసుల బందోబస్తు ఏర్పాటైంది. మాజీ ముఖ్యమంత్రి జయలలిత అధికారిక పోయెస్గార్డెన్ నివాసగృహానికి చేరువలోనే రజనీకాంత్ నివాసం కూడా ఉంది. జయలలిత బతికున్నప్పుడు ఆ ప్రాంతం వద్ద పోలీసులు భద్రత పేరుతో నానా హడావుడి చేసేవారు. ఆ మార్గంలో వాహనాలను వెళ్లనిచ్చేవారు కాదు. జయ మృతి తర్వాత పోయెస్గార్డెన్ ప్రాంతంలో పోలీసుల భద్రత తొలగించారు. ఈ నేపథ్యంలో పోయెస్గార్డెన్లో రజనీ నివాసం వద్ద పోలీసులు రోజువారీ భద్రతా ఏర్పాట్లను ప్రారంభించారు. ఆ నివాసం రహదారి వద్ద బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు.
