ఈ నగరాల్లో న్యూ ఇయర్ పార్టీలకు అనుమతి లేదు...
ABN , First Publish Date - 2020-12-15T13:25:54+05:30 IST
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో డిసెంబరు 31వతేదీన 2021 కొత్త సంవత్సర వేడుకలకు అనుమతి లేదని....
సర్కారు ప్రకటన
అహ్మదాబాద్ : దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో డిసెంబరు 31వతేదీన 2021 కొత్త సంవత్సర వేడుకలకు అనుమతి లేదని పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో డిసెంబరు 31వతేదీన న్యూఇయర్ పార్టీలు ఉండవని గుజరాత్ సర్కారు వెల్లడించింది. అహ్మదాబాద్ నగరంలో ఇప్పటికే రాత్రి కర్ఫ్యూ అమలులో ఉన్న నేపథ్యంలో న్యూఇయర్ వేడుకలు, సామాజిక సమావేశాలు, పార్టీలను నిషేధించామని అధికారులు చెప్పారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు డిసెంబరు 31వతేదీన అహ్మదాబాద్ నగరమంతా పోలీసులను మోహరిస్తామని నగర డిప్యూటీ పోలీసు కమిషనర్ హర్షద్ పటేల్ చెప్పారు. రాత్రి 9 గంటలకు ముందు న్యూఇయర్ పార్టీలకు హాజరయ్యూే వారు తప్పనిసరిగా కొవిడ్-19 మార్గదర్శకాలను పాటించాలని, సామాజిక దూరం పాటించాలని, ముసుగులు ధరించాలని హర్షద్ పటేల్ కోరారు.
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సిమ్లా, కులూ, కాంగ్రా, మండీలలలో నూతన సంవత్సర వేడుకలను అనుమతించబోమని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. హిమాచల్ ప్రభుత్వం సోమవారం నాలుగు జిల్లాల్లో నైట్ కర్ఫ్యూను జనవరి 5వతేదీ వరకు పొడిగించారు. సిమ్లా, మండీ, కాంగ్రా, కులూ జిల్లాల్లో రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమలులో ఉంటుందని అధికారులు చెప్పారు. కరోనా వ్యాక్సిన్ ను మొదట ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్ లైన్ కార్మికులు, 50 ఏళ్లు పైబడిని వారికి అందిస్తామని సర్కారు ఇప్పటికే ప్రకటించింది.