అత్యాధునిక శౌర్య మిసైల్ ప్రయోగం విజయవంతం
ABN , First Publish Date - 2020-10-03T21:04:21+05:30 IST
చైనాతో ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలో భారత దేశం సైనిక పాటవాన్ని రోజు రోజుకూ పెంచుకుంటోంది. శనివారం ఒడిశాలోని ఓ కేంద్రం నుంచి శౌర్య మిసైల్
న్యూఢిల్లీ : చైనాతో ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలో భారత దేశం సైనిక పాటవాన్ని రోజు రోజుకూ పెంచుకుంటోంది. శనివారం ఒడిశాలోని ఓ కేంద్రం నుంచి శౌర్య మిసైల్ నూతన వెర్షన్ను విజయవంతంగా పరీక్షించింది. ఇది అణ్వాయుధ సామర్థ్యంగల మిసైల్.
ప్రభుత్వ ఉన్నత స్థాయి వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, శౌర్య తరహా మిసైల్ ప్రస్తుతం సైనిక దళాల వద్ద ఉంది. వాటికి తోడుగా కొత్త వెర్షన్ శౌర్య మిసైల్ను త్వరలో ప్రవేశపెడతారు. ప్రస్తుత మిసైల్తో పోల్చినపుడు ఈ నూతన మిసైల్ తేలికగా ఉంటుంది. దీనితో కార్యకలాపాలు నిర్వహించడం కూడా సులువుగా ఉంటుంది. 800 కిలోమీటర్ల పరిథిలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. లక్ష్యానికి చేరువయ్యే దశలో ఈ మిసైల్ హైపర్సోనిక్ వేగంతో ప్రయాణిస్తుంది.
ఇదిలావుండగా, మహారాష్ట్రలోని అహ్మద్నగర్లో మంగళవారం లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ను విజయవంతంగా పరీక్షించారు. దీనిని దేశీయంగానే అభివృద్ధిపరిచారు. బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ పరీక్ష కూడా బుధవారం విజయవంతమైంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రకటించిన స్వయం సమృద్ధ భారత్ నినాదానికి అనుగుణంగా మిసైల్స్ను అభివృద్ధిపరిచేందుకు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) కృషి చేస్తోంది. స్ట్రాటజిక్ మిసైల్స్ రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు కృషి చేస్తోంది.