ఆ వ్యాఖ్యలు తీవ్రంగా బాధించాయి : సచిన్ పైలట్
ABN , First Publish Date - 2020-08-11T20:37:41+05:30 IST
సంక్షోభ సమయంలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ చేసిన వ్యాఖ్యలు తననెంతో బాధించాయని

న్యూఢిల్లీ : సంక్షోభ సమయంలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ చేసిన వ్యాఖ్యలు తననెంతో బాధించాయని యువనేత సచిన్ పైలట్ పేర్కొన్నారు. ‘‘పనికిమాలిన వ్యక్తి, సర్కారును కూలదోయడానికి బీజేపీతో కలిసి కుట్రలు పన్నుతున్నారు’’ అని సీఎం చేసిన వ్యాఖ్యలు చాలా బాధించాయని తెలిపారు. ‘‘నా కుటుంబం నాకు కొన్ని విలువలను నేర్పింది. నేను ఎవరిని, ఎంత వ్యతిరేకించినా అలాంటి భాషను మాత్రం నేనెప్పుడూ ఉపయోగించలేదు’’ అని స్పష్టం చేశారు.
తనకంటే సీఎం గెహ్లోత్ వయస్సులో చాలా వ్యక్తి అని, ఆయనను చాలా గౌరవిస్తానని ఆయన స్పష్టం చేశారు. అయితే... విధి నిర్వహణలో ఉన్న లోపాలపై గొంతెత్తే హక్కు తనకు పూర్తిగా ఉందని పేర్కొన్నారు. 20 ఏళ్ల రాజకీయ జీవితంలో తానెన్నడూ లక్ష్మణ రేఖ దాటలేదని స్పష్టం చేశారు. వ్యక్తిగత దూషణలు చేయడం, కఠినమైన పదాలు వాడటం లాంటివి చేయడం సరికాదని, ప్రజా జీవితంలో అవి ఉండకూడదని పరోక్షంగా సీఎం గెహ్లోత్కు చురకలంటించారు. సీఎం గెహ్లోత్పై తనకు ఎలాంటి వ్యక్తిగత కక్ష లేదని పైలట్ స్పష్టం చేశారు.