కరోనా టీకా: భారత్ సహాయం కోరిన నేపాల్!
ABN , First Publish Date - 2020-12-31T03:01:07+05:30 IST
కరోనా టీకాల కోసం నేపాల్ భారత ప్రభుత్వ సహాయాన్ని కోరింది.

న్యూఢిల్లీ: కరోనా టీకాల కోసం నేపాల్ భారత ప్రభుత్వ సహాయాన్ని కోరింది. తమ దేశంలో 20 శాతం జనాభాకు సరిపడా టీకాలను భారత్ నుంచి కొనుగోలు చేసేందుకు నేపాల్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసినట్టు తెలిసింది. కరోనా కారణంగా నేపాల్ తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటోంది. ఇప్పటికే అక్కడ దాదాపు 2.6 లక్షల మంది ఈ వ్యాధి బారినపడ్డారు. 1800 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా కరోనా టీకా డోసులను సమకూర్చుకోవాలని నేపాల్ ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే వివిధ దేశాలను, టీకా తయారీ కంపెనీలను సంప్రదించిన అక్కడి ప్రభుత్వం తాజాగా భారత్కూ లేఖ రాసినట్టు నేపాల్ మీడియాలో ప్రచురితమైంది. అయితే..భారత్ ప్రభుత్వం నేపాల్కు ఈ విషయమై గత నెలలోనే భరోసా ఇచ్చింది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక నేపాల్ అవసరాలకే తొలి ప్రాధాన్యం ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చింది.