దేశ మ్యాప్ సవరణకు నేపాల్ ప్రెసిడెంట్ ఆమోదం
ABN , First Publish Date - 2020-06-19T02:20:09+05:30 IST
వివాదాస్పద మ్యాప్ సవరణ బిల్లును నేపాల్ ప్రెసిడెంట్ బిద్యా దేవి భండారీ
ఖాట్మండు : వివాదాస్పద మ్యాప్ సవరణ బిల్లును నేపాల్ ప్రెసిడెంట్ బిద్యా దేవి భండారీ గురువారం ఆమోదించారు. భారత దేశంలోని లిపులేఖ్, కాలాపానీ, లింపియధురలను తమ భూభాగాలుగా నేపాల్ పేర్కొంటోంది. దేశ రాజకీయ, పరిపాలన మ్యాప్ను సవరించేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లును ఆ దేశ పార్లమెంటు ఆమోదించిన సంగతి తెలిసిందే.
నూతన మ్యాప్కు నేపాల్ ప్రెసిడెంట్ ఆమోదం లభించడంతో ఆ దేశ కోట్ ఆఫ్ ఆర్మ్స్ కాలాపానీ, లిపులేఖ్, లింపియధురలను దేశ రాజకీయ, పరిపాలన మ్యాప్లో చేర్చుతుంది.
భారత భూభాగాలను కలిపేసుకుంటూ కొత్త మ్యాప్ను నేపాల్ నేషనల్ అసెంబ్లీ గురువారం ఏకగ్రీవంగా ఆమోదించింది. దీనికి సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు అనుకూలంగా సభకు హాజరైనవారంతా (57 మంది) ఓటు వేశారు.
భారత భూభాగాలను కలుపుకుంటూ నేపాల్ రాజకీయ, పరిపాలన సంబంధిత మ్యాప్ను సవరించేందుకు ఈ బిల్లును రూపొందించారు.
లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాలు తమ దేశానికి చెందినవని నేపాల్ చెప్తోంది. వీటిని కలుపుతూ కొత్త మ్యాప్ను రూపొందించి, రాజ్యాంగ సవరణ బిల్లును రూపొందించారు. ఈ బిల్లును నేపాల్ పార్లమెంటు దిగువ సభ శనివారం ఆమోదించింది.
కృత్రిమ విస్తరణపై భారత్ అభ్యంతరం
నేపాల్ పార్లమెంటు దిగువ సభ ఈ మ్యాప్ను ఆమోదించిన వెంటనే భారత ప్రభుత్వం స్పందించింది. నేపాల్ కృత్రిమంగా భూభాగాన్ని విస్తరించుకోవడం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాలు తమ దేశానికి చెందినవని స్పష్టం చేసింది.
రక్షణ మంత్రి రోడ్డును ప్రారంభించడంతో...
భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మే 8న లిపులేఖ్ పాస్ నుంచి ఉత్తరాఖండ్లోని ధార్చుల వరకు 80 కిలోమీటర్ల పొడవైన రోడ్డును ప్రారంభించారు. దీంతో నేపాల్ ఈ భూభాగాలు తమ దేశానికి చెందినవని చెప్తూ, రాజకీయ మ్యాప్ను సవరించింది.
నేపాల్ సరిహద్దులో 5 రాష్ట్రాలు
నేపాల్-భారత దేశం మధ్య సరిహద్దు 1,850 కిలోమీటర్లు మేరకు ఉంది. సిక్కిం, పశ్చిమ బెంగాల్, బిహార్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు నేపాల్ సరిహద్దుల్లో ఉన్నాయి.