రైతుల కోసం అవసరమైతే ఎన్డీయేతో కటీఫ్: ఆర్‌ఎల్పీ చీఫ్..

ABN , First Publish Date - 2020-12-01T03:55:06+05:30 IST

వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోకుంటే ఎన్డీయే నుంచి బయటికి వచ్చేస్తామని రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ..

రైతుల కోసం అవసరమైతే ఎన్డీయేతో కటీఫ్: ఆర్‌ఎల్పీ చీఫ్..

 జైపూర్: వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోకుంటే ఎన్డీయే నుంచి బయటికి వచ్చేస్తామని రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ (ఆర్‌ఎల్పీ) హెచ్చరించింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు రైతు వ్యతిరేకమైనవనీ.. వాటిని ఉపసంహరించు కోవాల్సిందేనని ఆర్‌ఎల్పీ చీఫ్, రాజౌరీ ఎంపీ హనుమాన్ బనివాల్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఓ వైపు కరోనా మహమ్మారి, మరోవైపు విపరీతమైన చలిలో రైతులు ఆందోళన చేస్తున్నందున కేంద్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని బనివాల్ కోరారు. ‘‘ఈ విషయంలో కేంద్రం వెంటనే నిర్ణయం తీసుకోకుంటే.. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎన్డీయేకి ఇచ్చిన మద్దతుపై అర్‌ఎల్పీ పునరాలోచించాల్సి ఉంటుంది..’’ అని బనివాల్ పేర్కొన్నారు. తాము ఎన్డీయే మిత్రపక్షమే అయినప్పటికీ.. యువత, రైతులే తమ పార్టీకి బలమని ఆయన అన్నారు. రైతు ప్రయోజనాల కోసం అవసరమైతే మద్దతు ఉపసంహరించుకోవడానికి సైతం తాము వెనకాడబోమని ఆయన స్పష్టం చేశారు. 

Updated Date - 2020-12-01T03:55:06+05:30 IST