ఆహారం ముట్టుకున్నాడని దళితుడి హత్య!
ABN , First Publish Date - 2020-12-10T12:20:30+05:30 IST
మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాలో సమాజం తలవంచుకునే ఘటన చోటుచేసుకుంది.

ఛతర్పూర్: మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాలో సమాజం తలవంచుకునే ఘటన చోటుచేసుకుంది. పొరపాటున తమ ఆహారం ముట్టుకున్నాడని ఒక దళిత యువకుడిపై ఇద్దరు యువకులు దాడి చేసి హత్య చేశారు. అనంతరం వారు పరారయ్యారు. పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. ఈ ఉదంతం ఛతర్పూర్లోని గౌరిహార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కిషాన్పూర్ గ్రామంలో డిసెంబరు 7న ముగ్గురు యువకులు పార్టీ చేసుకున్నారు. వీరిలో దళిత యువకుడు దేవరాజ్ అనురాగీ ఉన్నాడు. అతను పార్టీ కోసం తెచ్చిన ఆహారాన్ని ముందుగా ముట్టుకున్నాడు. ఈ విషయం ఆ ప్రాంతంలోని అగ్రవర్ణాల వారికి తెలిసింది. దీంతో వారు ముందుగా ఆ దళిత యువకుడిని బెదిరించారు. తరువాత ఆ ఇద్దరు యువకులు అ దళిత యువకుడిని కర్రతో చావబాదారు.
ఫలితంగా అతను స్పృహతప్పి పడిపోయాడు. తరువాత ఆ యువకుడిని అతని ఇంటి దగ్గర వదిలేసి, ఆ ఇద్దరు యువకులు అక్కడి నుంచి పారిపోయారు. ఇంతలో గాయాలపాలైన ఆ దళిత యువకుడు ప్రాణాలొదిలాడు. ఆ యువకుని కుటుంబ సభ్యులు భూరా సోనీ, సంతోష్ పాల్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిద్దరిపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు పరారైన ఆ ఇద్దరు యువకుల కోసం గాలిస్తున్నారు. ఈ ఉదంతం గురించి ఛతర్పూర్ ఎఎస్పీ సమీర్ సౌరభ్ మాట్లాడుతూ ఈ ఉదంతం డిసెంబరు 7న జరిగిందని, కిషాన్పూర్ గ్రామంలో మతిస్థిమితం లేని దళిత యువకుడు దేవరాజ్ అనురాగీని... సోనీ, పాల్లు ఆహారం తినేందుకు పిలిచారని, రెండు గంటల తరువాత ఆ యువకుడిని అతని ఇంటిలో వదలివేశారన్నారు. తనను ఆ ఇద్దరు యువకులు కొట్టారని అనురాగీ తన కుటుంబ సభ్యులకు తెలిపాడు. వారి ఆహారం ముట్టుకున్నందుకు కొట్టారని అనురాగీ ఆరోపించాడన్నారు. త్వరలోనే నిందింతులను పట్టుకుంటామని తెలిపారు.