కర్ణాటక చిన్న తరహా పరిశ్రమల్లో అత్యధికం మూతపడనున్నాయా?
ABN , First Publish Date - 2020-10-21T17:20:41+05:30 IST
ఆర్థిక మాంద్యం, కోవిడ్-19 మహమ్మారి వల్ల కర్ణాటకలోని సూక్ష్మ

శివమొగ్గ : ఆర్థిక మాంద్యం, కోవిడ్-19 మహమ్మారి వల్ల కర్ణాటకలోని సూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ)లు మూతపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దుస్థితి నుంచి కోలుకోవడానికి చాలా కాలం పట్టే అవకాశం కనిపిస్తోంది.
మన దేశంలో పారిశ్రామికీకరణ అధికంగా జరిగిన రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి. ఈ రాష్ట్రంలో 7.6 లక్షల ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. బెంగళూరులోనే 2.6 లక్షల పరిశ్రమలు ఉన్నాయి. ఈ రంగంలో సుమారు 2.6 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు.
కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు అమలు చేసిన అష్ట దిగ్బంధనం వల్ల 20 శాతం పరిశ్రమలు దెబ్బతిన్నాయి. వీటిలో దాదాపు సగం పరిశ్రమలను తిరిగి తెరవలేదు. బెంగళూరు శివారులోని పీన్య ఇండస్ట్రియల్ ఏరియాలో 8,500 ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. వీటిలో నిత్యావసర వస్తువులను సరఫరా చేసే పరిశ్రమలు మినహా మిగిలినవి అష్ట దిగ్బంధనం సమయంలో మూతపడ్డాయి. వీటిలో దాదాపు 10 శాతం పరిశ్రమలను తిరిగి తెరవలేదు.
కర్ణాటక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అధ్యక్షుడు కేబీ అరసప్ప తెలిపిన వివరాల ప్రకారం, కార్మికులు తమ సొంతూళ్ళకు వెళ్ళడం వల్ల కార్మికుల కొరత ఏర్పడటంతో, చాలా పరిశ్రమలను ఇప్పటికీ తెరవలేదు. మరోవైపు ప్రభుత్వం ప్రకటించిన తాయిలాలు కాగితాలకే పరిమితమయ్యాయి.
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) జాతీయ కార్యవర్గ కమిటీ సభ్యుడు రమేశ్ మాట్లాడుతూ, ఎంఎస్ఎంఈలకు నగదు ప్రోత్సాహకాలు ఇవ్వడానికి బదులుగా అప్పులు తెచ్చుకోవాలని ప్రభుత్వం చెప్తోందన్నారు. ఇప్పటికే ఎంఎస్ఎంఈలు రుణాల ఊబిలో కూరుకుపోయాయన్నారు. ప్రస్తుత రుణాలను తీర్చడానికే ఇబ్బందులు పడుతూ ఉంటే, కొత్త రుణాలను ఎలా చెల్లించగలరని ప్రశ్నించారు. ఇబ్బందుల్లో ఉన్న ఎంఎస్ఎంఈలను ఒడ్డునపడేయాలని ప్రభుత్వం కోరుకుంటే, ప్రత్యక్ష నగదు ప్రయోజనాలను ప్రకటించి ఉండేదన్నారు.