మహారాష్ట్ర పోలీసులపై కరోనా దెబ్బ!

ABN , First Publish Date - 2020-04-26T22:27:51+05:30 IST

కరోనా తుఫానులో పడి మహారాష్ట్రా అతలాకుతమవుతోంది. దీంతో కరోనా యుద్ధంలో ముందుండి పోరాడుతున్న పోలీసులపై కూడా కరోనా ప్రభావం పడింది.

మహారాష్ట్ర పోలీసులపై కరోనా దెబ్బ!

ముంబై: కరోనా తుఫానులో పడి మహారాష్ట్రా అతలాకుతమవుతోంది. దీంతో అక్కడి పోలీసులపై కూడా కరోనా ప్రభావం పడింది. ఇప్పటికే అక్కడ 100 మందికి పైగా పోలీసులు కరోనా బారినపడ్డట్టు అధికారులు చెబుతున్నారు. ఈ మహమ్మారి ఇద్దరు పోలీసులను పొట్టనపెట్టుకోవడంతో డిపార్ట్‌మెంట్ అంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. ‘కరోనా వైరస్‌తో పోరాడుతూ ఇద్దరు పోలీసులు మృతి చెందారని చెప్పటానికి చింతిస్తున్నాము. ప్రభుత్వం వారి కుటుంబాలను ఆదుకుంటుంది’ అని మహారాష్ట్రా ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఈ రోజు మధ్యహ్నం వీడియో కాన్ఫరెన్సులో తెలిపారు.


తాజా లెక్కల ప్రకారం మహా పోలీసు డిపార్ట్‌మెంటులో మొత్తం 107 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో ఏడుగురు పోలీసులు వ్యాధి నుంచి బయటపడ్డారు. కరోనాకు బలైన చంద్రకాంత్ గన్‌పత్ పెందుర్కర్(57) , సందీప్ సుర్వేలకు(52) పోలీసులు నివాళులర్పించారు. ‘కరోనాతో పోరాడుతూ ఇద్దరు పోలీసు వీరులు నెలకొరిగారు. వారికి నివాళులర్పిస్తూ.. ఈ రోజు మేము ఎటువంటి ట్వీట్స్ చేయము..రెస్పాన్సులు మాత్రమే పోస్ట్ చేస్తాము’ అని పోలీసు శాఖ ట్వీట్ చేసింది. మరోవైపు.. నవీ ముంబైకి చెందిన ఓ పోలీసు కరోనా బారిన పడటంతో ఆయన భార్యకు కూడా ఈ వ్యాధి సోకింది. దీంతో ఆమె మృతి చెందారు. వారి కూతురికి కోసం వ్యాధి సోకినట్టు సమాచారం. కరోనాతో ముందుండి పోరాడాల్సి వారే దీనితో సతమతమవుతుండటంతో ప్రభుత్వం మరిన్ని పటిష్ట చర్యల దిశగా అడుగులు వేస్తోంది. 

Updated Date - 2020-04-26T22:27:51+05:30 IST