భారీ వర్షాలకు 8 రాష్ట్రాల్లో 470 మంది మృతి!
ABN , First Publish Date - 2020-07-22T11:29:23+05:30 IST
ఒకవైపు కరోనా వైరస్ విలయతాండవం చేస్తుండగా, మరోవైపు భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. దేశంలోని 8 రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా ఏర్పడిన వరదలు, కొండచరియలు...
న్యూఢిల్లీ: ఒకవైపు కరోనా వైరస్ విలయతాండవం చేస్తుండగా, మరోవైపు భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. దేశంలోని 8 రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా ఏర్పడిన వరదలు, కొండచరియలు విరిగిపడటం తదితర ఘటనల్లో 470 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమ బెంగాల్, అసోం, గుజరాత్ తదితర రాష్ట్రాలు భారీ వర్షాలకు అధికంగా ప్రభావితమవుతున్నాయి. ఈ వర్షాకాలంలో పశ్చిమ బెంగాల్లో వరదల కారణంగా 142 మంది మృతిచెందినట్లు హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ రాష్ట్రంలో ఐదుగురు గల్లంతయ్యారు. వరదల కారణంగా అసోంలో 111, గుజరాత్లో 81 మంది, మహారాష్ట్రలో 46, మధ్యప్రదేశ్లో 44 మంది మృతి చెందారు. కేరళలోని 13 జిల్లాల్లో వరదలు సంభవించి 23 మంది ప్రాణాలు కోల్పోయారు. బాధితులకు సహాయం అందించేందుకు ఆయా రాష్ట్రాల్లో 800కి పైగా సహాయ శిబిరాలు ప్రారంభించారు. అయితే ఈ సహాయక శిబిరాల్లో సామాజిక దూరానికి కట్టుబడి ఉండటం పెద్ద సవాలుగా పరిణమించింది. ఐక్యరాజ్యసమితి వెలువరించిన డేటా ప్రకారం పర్యావరణంలో వచ్చిన మార్పుల కారణంగా ప్రతిఏటా ప్రపంచంలో 26 మిలియన్లకు పైగా ప్రజలు పేదలుగా మారుతున్నారు.