లాక్డౌన్ ఎత్తివేతకు మోదీ విముఖం!
ABN , First Publish Date - 2020-04-08T22:37:12+05:30 IST
కరోనా విజృంభణ, లాక్డౌన్ విషయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ

న్యూఢిల్లీ : కరోనా విజృంభణ, లాక్డౌన్ విషయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీ లాక్డౌన్ విషయంపై నర్మగర్భ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. లాక్డౌన్ ఎత్తేసే విషయంలో మోదీ అంత సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ప్రజల ప్రాణాలను కాపాడుకోవాలంటే లాక్డౌన్ ఒక్కటే ఏకైక పరిష్కారమని ఫ్లోర్ లీడర్లతో మోదీ అన్నట్లు సమాచారం.
‘‘ప్రజల ప్రాణ రక్షణకై లాక్డౌనే పరిష్కారం. నేను ప్రతిరోజూ అన్ని రాష్ట్రాల సీఎంలతో, నిపుణులతో చర్చిస్తూనే ఉన్నా. లాక్డౌన్ ఎత్తివేయాలని ఏ ఒక్కరూ అభిప్రాయపడలేదు. మరోసారి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడతా. ఇప్పటి వరకైతే మొత్తానికి మొత్తం లాక్డౌన్ ఎత్తేయడం సాధ్యం కాకపోవచ్చు. జిల్లా అధికారులతో కూడా మాట్లాడుతున్నాము. సామాజిక దూరం పాటించే విషయంలో మనం మరింత కఠినంగా ఉండాల్సిందే. మున్ముందు మరిన్ని ఊహించని నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు’’ అని మోదీ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
దేశంలో పరిస్థితి సామాజిక అత్యవసర పరిస్థితికి సమానంగా కనిపిస్తోందని, మరిన్ని కఠిన నిర్ణయాలు అవసరమని, మరింత జాగరూకతతో వ్యవహారించాల్సి ఉందని అఖిలపక్ష నేతలో మోదీ పేర్కొన్నారు. ఏప్రిల్ 14 తర్వాత లాక్డౌన్ ఎత్తేసే అవకాశాలు కనిపించడం లేదని, కరోనాకు ముందు పరిస్థితి, తర్వాత పరిస్థితి అన్నట్లుగా మారుతుందని ఫ్లోర్ లీడర్లతో ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.